Begin typing your search above and press return to search.

హస్తంలో నిర్వేదం.. ఇలాగయితే ఎలా పోటీ చేసేది?

2017–18, 2020–21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ కాంగ్రెస్‌ పార్టీకి నోటీసులు పంపింది.

By:  Tupaki Desk   |   30 March 2024 4:53 AM GMT
హస్తంలో నిర్వేదం.. ఇలాగయితే ఎలా పోటీ చేసేది?
X

2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ.. కాంగ్రెస్‌ కు ఆదాయ పన్ను శాఖ (ఐటీ) చుక్కలు చూపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల ముంగిట ఆ శాఖ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది. ఎన్నికల ముంగిట తమను దెబ్బతీయడమే లక్ష్యంగా తమ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని నగదు నిల్వలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐటీ శాఖతో జప్తు చేయించిందని కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

ఎన్నికల ప్రచారానికి నేతలను పంపడానికి విమాన టికెట్లు బుక్‌ చేయడానికి, చివరకు రైలు టికెట్లు బుక్‌ చేయడానికి కూడా తమ వద్ద డబ్బుల్లేవని కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే నిర్వేదం వ్యక్తం చేశారు. రూ.2 కూడా ఖర్చు పెట్టలేని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. దీనికంతటికీ కారణం మోదీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. కేంద్ర సంస్థలు.. ఈడీ, సీబీఐ, ఐటీ తదితరాలను జేబు సంస్థలుగా వాడుకుని ప్రతిపక్షాలను వేధిస్తోందని ధ్వజమెత్తారు.

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ 2022–23కి గానూ రూ.118 కోట్లు ఆదాయపన్ను కట్టాల్సి ఉందని.. కట్టకపోవడం వల్లే ఆ పార్టీ బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాన్ని స్తంభింపజేశామని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినా ఊరట దక్కలేదు. న్యాయమూర్తి కాంగ్రెస్‌ పిటిషన్‌ ను తోసిపుచ్చడంతో డివిజన్‌ బెంచ్‌ కు అప్పీలు చేసి పునఃపరిశీలన చేయాలని ఆ పార్టీ కోరింది. అయినప్పటికీ ఊరట దక్కలేదు. ఈ వ్యవహారంలో ఇప్పటికిప్పుడు తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని, కాంగ్రెస్‌ పార్టీ పన్ను చెల్లించాల్సి ఉందని ఐటీ శాఖ చెబుతోందని కోర్టు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ వేసిన పిటిషన్‌ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన వెంటనే ఆదాయ పన్ను శాఖ ఆ పార్టీపై కొరడా ఝులిపించింది. 2017–18, 2020–21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలంటూ కాంగ్రెస్‌ పార్టీకి నోటీసులు పంపింది.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం అంటే ఇదేనా అని నిలదీశారు. ప్రతిపక్షాలను ఎన్నికల్లో పోటీ చే యనీయకుండా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఐటీ శాఖ ఇచ్చిన తాజా నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే కాకుండా ప్రతిపక్షాల విమర్శలకు తగ్గట్టే సీపీఐకి కూడా ఆదాయ పన్ను శాఖ పన్ను చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం గమనార్హం. గత కొన్నేళ్లుగా పన్ను రిటర్నులు సమర్పించేటప్పుడు పాత పాన్‌ కార్డు ఉపయోగించారని.. ఈ నేపథ్యంలో ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని ఐటీ శాఖ సీపీఐకి నోటీసు జారీ చేసింది.

అలాగే పశ్చిమ బెంగాల్‌ లో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా ఐటీ శాఖ నుంచి 11 నోటీసులు రావడం గమనార్హం. దీంతో సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ దారిలోనే కోర్టును ఆశ్రయించనున్నాయి.