Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఎదగడం తట్టుకోలేకపోతున్న ఇండియా కూటమి ఫ్రెండ్స్...?

కాంగ్రెస్ పార్టీ బాగా ఎదుగుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్క సారిగా పెరుగుతోంది. కాంగ్రెస్ కర్నాటకలో గెలిచి సౌతిండియాలో శుభారంభం పలికింది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 3:30 PM GMT
కాంగ్రెస్ ఎదగడం తట్టుకోలేకపోతున్న ఇండియా కూటమి ఫ్రెండ్స్...?
X

కాంగ్రెస్ పార్టీ బాగా ఎదుగుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్క సారిగా పెరుగుతోంది. కాంగ్రెస్ కర్నాటకలో గెలిచి సౌతిండియాలో శుభారంభం పలికింది. తమిళనాడు తరువాత పెద్ద స్టేట్ కర్నాటక. ఇక్కడ 28 ఎంపీ సీట్లు ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసింది.

ఇపుడు చూస్తే దేశంలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో నాలుగు కచ్చితంగా కాంగ్రెస్ కి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. అవే మిజోరం, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణా. ఈ నాలుగులో మధ్యప్రదేశ్ పెద్ద స్టేట్. ఇక దక్షిణాదిన తెలంగాణా గెలుచుకుంటే ఏపీలోనూ పొత్తులు కలుస్తాయి. తమిళనాడులో ఎటూ డీఎంకే పొత్తు ఉంది. కేరళలో కామ్రేడ్స్ మద్దతు కాంగ్రెస్ కూటమికే దక్కుతుంది.

నార్త్ లో చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ గెలుపు తరువాత ఉత్తరాదిన పట్టు పెరుగుతుందని ఆశ ఉంది. హిమాచల్ ప్రదేశ్ ని అలాగే గెలుచుకున్నారు. ఢిల్లీలో బలం పెరుగుతోంది. దీంతో పాటు మహారాష్ట్రలో ఆశలు కాంగ్రెస్ కి బాగానే ఉన్నాయి. బీహార్ లో చూసుకున్నా కాంగ్రెస్ మిత్రులతో కలసి ఉంది.

ఈ నేపధ్యంలో ఇపుడు ఇండియా కూటమిలో నుంచి లుకలుకలు బయటపడుతున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ అయితే కాంగ్రెస్ ఇండియా కూటమిని బలోపేతం మీద ఫోకస్ పెట్టడం లేదని ఆ మధ్యన విమర్శలు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే కాంగ్రెస్ ఢిల్లీలో పంజాబ్ లో తమకు సహకరించాలని లేకపోతే తాము కూడా అలాగే వ్యవహరిస్తామని చెప్పేశారు.

ఆ మధ్య ఒకసారి కాంగ్రెస్ మీద మండిపడ్డ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇపుడు మళ్ళీ బిగ్ సౌండ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ కుల గణన ఎందుకు చేయలేదు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ కుల గణన హామీ ఇస్తోందని అంటూ ఏకంగా రాహుల్ గాంధీ ఇచ్చిన ఈ ప్రతిష్టాత్మకమైన హామీ మీదనే రాజకీయ రచ్చ స్టార్ట్ చేశారు.

అంటే కుల గణన పేరిట కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాలలో పరపతి పెంచుకుంటే అది అంతిమంగా తమ ఓటు బ్యాంక్ కి దెబ్బ తీసేలా ఉంటుందని ముందుగానే గ్రహించి విపక్షాలు ఇలా చేస్తున్నాయని అంటున్నారు. అదే విధంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగి వందకు పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటే రేపటి ప్రధాని అభ్యర్ధి ఆ పార్టీ నుంచే వస్తారు అన్న బెంగ కూడా ఉంది.

అందుకే నితీష్ కేజ్రీవాల్, అఖిలేష్ ఇలా బయటపడిపోతున్నారు అని అంటున్నారు. మరో వైపు మమతా బెనర్జీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఆమెకు కూడా ప్రధాని పదవి మీద ఆశ ఉంది. కాంగ్రెస్ రాహుల్ ఇలా అంతకంతకు ఎదిగిపోవడంతో ఇండియా కూటమి నేతలకు ప్రధాని రేసులో ఉన్న వారికి కలవరం రేగుతోంది అని అంటున్నారు.

ఇలా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది అంటే అది ప్రాంతీయ పార్టీల పుట్టె ముంచవచ్చు అన్న కంగారు వారిలో పట్టుకుంది అని అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ నాలుగు స్టేట్స్ ని గెలిస్తే మాత్రం బీజేపీతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది అని అంటున్నారు. అయితే ఎప్పటికైనా దేశంలో బీజేపీ వంటి జాతీయ పార్టీకి కాంగ్రెస్ మాత్రమే ఆల్టర్నేషన్ అని జనాలు భావిస్తారు అని అంటున్నారు.

కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించి మిత్రపక్షాలను మద్దతుగా ఉంచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమనే జనాలు కోరుకుంటారు. అలా అయితేనే ఇండియా కూటమి వైపు ఉంటారు. అంతే తప్ప కలగూర గంపలా ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం రచ్చ చేస్తే మాత్రం ఇండియా కూటమికి అర్థం లేకుండా పోతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ బలం విపక్షాలకు ఇపుడు కలవరం అయితే మాత్రం మరోసారి అది బీజేపీకే మేలు చేస్తుంది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.