Begin typing your search above and press return to search.

తెర ఎనక నాసామి... కాంగ్రెస్‌ ఖాతాలోకి సీఎం రమేష్ నిధులు!!

అసలు అంత సొమ్ము అక్కడికి ఇటీవలే విరాళంగా ఇవ్వడానికి గల కారణం ఏమిటనేది ఆసక్తిగా మారింది.

By:  Tupaki Desk   |   23 March 2024 4:38 AM GMT
తెర ఎనక నాసామి... కాంగ్రెస్‌ ఖాతాలోకి సీఎం రమేష్ నిధులు!!
X

ప్రస్తుతం ఒక పార్టీలో ఉన్న వ్యక్తి పక్కపార్టీ నేతలతో మాట్లాడితేనే.. ఉన్న పార్టీలో టిక్కెట్లు దక్కని రోజులివి! తాజాగా ఏపీలో ఇలాంటి ఇష్యూ ఒకటి వైరల్ గా మారింది! అలాంటి పరిస్థితుల్లో.. అలాంటి రాజకీయాలున్న రోజుల్లో.. అలాంటి సందేహాలున్న అధినేతలు ఉన్న నేటి పరిస్థితుల్లో.. ఒక పార్టీలో ఉంటూ, వారికి పూర్తి వ్యతిరేకమైన పార్టీకి నిధులు సమకూర్చడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ ప్రశ్న వైరల్ గా మారింది!

అవును... 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో ఉండి, ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీలో చేరిన సీఎం రమేష్ స్థాపించిన కంపెనీ కొన్న ఎలక్టోరల్ బాండ్ల రూపంలోని విరాళాలు, బీజేపీకి ఒక్క రూపాయి చేరకపోగా... బీజేపీ బద్దశత్రువుగా భావించే కాంగ్రెస్ కి మెజారిటీగా సుమారు 67% సొమ్ము చేరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు అంత సొమ్ము అక్కడికి ఇటీవలే విరాళంగా ఇవ్వడానికి గల కారణం ఏమిటనేది ఆసక్తిగా మారింది.

దీంతో... టీడీపీ అధినేతకు స్నేహితుడు అనే పేరుండటం ఏమిటి.. ప్రస్తుతం బీజేపీలో ఉండటం ఏమిటి.. కాంగ్రెస్ పార్టీకి విరాళం ఇవ్వడం ఏమిటి.. ఇలాంటి చిక్కు ప్రశ్నలుగా తెరపైకి వస్తున్నాయి. దీనికి వైసీపీ నుంచి సమాధానం ఇప్పటికే వచ్చేసింది. ఇదంతా చంద్రబాబు మార్కు రాజకీయాల్లో భాగమనే కామెంట్లు వారి నుంచి వినిపించడం మొదలైంది. ఇదే సమయంలో... టీడీపీ - కాంగ్రెస్‌ వేరురు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ను చంద్రబాబే డబ్బులిచ్చి నడిపిస్తున్నాడని మరోసారి స్పష్టంగా ఆధారాలతో బట్టబయలైందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ స్థాపించిన కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్.పీ.పీ.ఎల్) మొత్తంగా సుమారు రూ. 45 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను సేకరించింది. అయితే ఊహించని విధంగా అన్నట్లుగా వాటిలో ఒక్కరూపాయి కూడా తాను రాజ్యసభ ఎంపీగా ఉన్న బీజేపీకి విరాళంగా ఇవ్వలేదు సరికదా... 2023 జనవరి - ఏప్రిల్ మధ్య, అంటే... కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చారు!



దీంతో కర్ణాటకలో బీజేపీని ఓడించడానికన్నట్లుగా కాంగ్రెస్ కు ఆర్థికంగా సహకరించి.. ఇప్పుడు ఏపీలో అదే బీజేపీతో జతకట్టి అధికారంలోకి రావాలని భావిస్తున్నారా అనే చర్చా తెరపైకి తెస్తున్నారు. ఇది బాబు మార్కు రాజకీయమని అంటున్నారు. ఇలా కేంద్రంలో సపోర్ట్ కోసం బీజేపీతో, కాపుల ఓట్లు కోసం జనసేనతో, జగన్ ను మరింత ఇబ్బంది పెట్టడంకోసం షర్మిళ నేతృత్వంలోని కాంగ్రెస్ తో బాబు.. అధికారిక, అనధికారిక పొత్తులు పెట్టుకుంటున్నారని చెడుగుడు ఆడుతున్నారు.

ఇలా కాషాయ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ.. కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక మిగిలిన వాటిలో రూ. 10 కోట్లు కర్ణాటకకు చెందిన ప్రాంతీయ పార్టీ జనతాదళ్ (ఎస్) కు, రూ.5 కోట్లు తెలుగుదేశం పార్టీకి వెళ్లాయి! ఇలా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ విరాళాలు కాంగ్రెస్ కు చేరినట్లు తెలుస్తుండటం, అవి చేరిన తర్వాత వైఎస్ షర్మిళ పార్టీ, కాంగ్రెస్ లో విలీనం అవ్వడం వంటి విషయాలను ఏపీ అధికార వైసీపీ విశ్లేషించడం మొదలుపెట్టింది.

ఇందులో భాగంగానే ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే విషయంలో కాంగ్రెస్ పార్టీని మౌనంగా ఉంచడానికి ఈ గిఫ్ట్ ని సీఎం రమేష్ ద్వారా చంద్రబాబు ఇప్పించారని కామెంట్ వైసీపీ నుంచి వినిపించడం మొదలైంది! దీంతో... కారణాలు ఏమైనా, కథానాయకులు ఎవరైనా... బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీలో బీజేపీ పొత్తులో ఉన్న పార్టీ మాజీ సభ్యుడు అయిన వ్యక్తి.. కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చడం మాత్రం వైరల్ గా మారింది! దీనిపై వివరణలూ గట్రా ఏమైనా ఉంటాయేమో వేచి చూడాలి!

ఇలా సీఎం రమేష్ కంపెనీ రిత్విక ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కాంగ్రెస్‌ కు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లు ఈ కింది విధంగా ఉన్నాయి. వీటిలో ఒక్కో బాండ్ విలువ రూ.కోటి రూపాయలు కాగా... ఇలాంటి మొత్తం 30 బాండ్లను కాంగ్రెస్ కు అందజేశారు!

బాండ్ల నెంబర్లు:

14402, 14412, 14414, 14416, 14418, 14420,14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477.