Begin typing your search above and press return to search.

సీఎం ఆఫీస్ రుషికొండ మీద ఏర్పాటు అవుతుందా... లేదా ...?

ఇపుడు పిటిషనర్లు మళ్ళీ రుషికొండ మీద అక్రమ కట్టడాలు అంటూ హైకోర్టుకు రావడంతో కేంద్ర బృందాలతో మరోసారి సర్వే చేయించాలని కోర్టు ఆదేశించింది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 3:00 AM GMT
సీఎం ఆఫీస్ రుషికొండ మీద ఏర్పాటు అవుతుందా... లేదా ...?
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ రావాలని నిర్ణయం తీసుకున్నారు. దాని కోసం ప్రభుత్వం విశాఖలో అనువైన భవనాలు చూసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విశాఖలో పర్యటించి నివాస యోగ్యమైన భవనాలను ఎంపిక చేసింది. ఇదిలా ఉండగా విశాఖలోని రుషికొండ మీద నిర్మిస్తున్న పర్యాటక భవనాలలలో కొన్నింటిని లీజుకు తీసుకుని సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు.

దాంతో జగన్ రాక ముందే కొందరు పిటిషనర్లు దీని మీద కోర్టుకు వెళ్లారు. రుషికొండ మీద కోర్టు అనుమతికి విరుద్ధంగా అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు అని గతంలో కోర్టుకు వెళ్ళిన పిటిషనర్లే ఇపుడు మరోసారి ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టారు.

గతంలో అయితే రుషికొండపై 9.88 ఎకరాలకు మాత్రమే పర్యావరణ శాఖ అనుమతి ఇస్తే ఏకంగా 20 ఎకరాలలో తవ్వకాలు చేపట్టారని పిటిషన్లు వేశారు. దాని మీద ప్రభుత్వం కూడా అనుమతించిన దాని కంటే మరో మూడు ఎకరాలలో అదనంగా నిర్మాణం చేపడుతున్నట్లుగా పేర్కొంది. ఇక కేంద్ర బృందాలు కూడా గతంలో హైకోర్టు ఆదేశానుసారం వచ్చి పరిశీలన చేసి నివేదికను హైకోర్టుకు అందచేశాయి.

ఇపుడు పిటిషనర్లు మళ్ళీ రుషికొండ మీద అక్రమ కట్టడాలు అంటూ హైకోర్టుకు రావడంతో కేంద్ర బృందాలతో మరోసారి సర్వే చేయించాలని కోర్టు ఆదేశించింది. తొందరలో కేంద్ర బౄందాలు రుషికొండకు వచ్చి అక్కడ పరిస్థితుల మీద సర్వే చేసి నివేదికను కోర్టుకు అందచేస్తాయని అంటున్నారు.

మరో వైపు చూస్తే జగన్ విశాఖకు మకాం డిసెంబర్ లోగా అని ఇటీవల ప్రకటించారు. అంటే నవంబర్ నెలలో ఉండవచ్చు అని అంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో కేంద్ర బృందాలు సర్వే చేసి కోర్టుకు నివేదిక ఇస్తే కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చర్చగా ఉంది. ఇక చూస్తే రుషికొండ మీద గతంలో టూరిజం కాటేజెస్ ఉండేవి. వాటిని కొట్టించి పెద్ద ఎత్తున ప్రభుత్వం భవనాలను ఆధుకీకరిస్తూ నిర్మించింది. ఈ క్రమంలో అనుమతి ఉన్న స్థలానికి మించి కూడా నిర్మాణాలు జరిగాయని కూడా అంటున్నారు.

ఇదిలా ఉంటే ఇపుడు దాదాపుగా కట్టడాలు అన్నీ పూర్తి అయ్యాయి. టూరిజం కూడా ప్రభుత్వ శాఖ. టూరిజం నుంచి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం లీజుకు తీసుకుని అక్కడ సీఎం మకాం పెడతారు అన్నది ప్రచారంలో ఉంది. మామూలుగా అయితే ప్రభుత్వ భవనాలలో కార్యకలాపాలు నిర్వహించడం అన్నది తప్పు కాదు కానీ ఇక్కడ పర్యావరణ అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించారు అని పిటిషనర్లు అభియోగం మోపుతున్న నేపథ్యంలో కేంద్ర బృందం సర్వే చేసి నిబంధనలను అతిక్రమించారు అని కనుక నివేదిక ఇస్తే మాత్రం హై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

ఒకవేళ ఈ భవనాలను వాడడానికి వీలు లేదు అంటే మాత్రం సీఎం మకాం కోసం వేరే భవనాలు చూసుకోవాల్సిందే అంటున్నారు. మరి రుషికొండ మీద అత్యాధునిక భవనాల విషయంలో ఏమి జరుగుతుంది సీఎం ఆఫీస్ రుషికొండ మీద ఏర్పాటు అవుతుందా లేదా అన్నది మాత్రం ప్రశ్నగానే ఉందిపుడు.