Begin typing your search above and press return to search.

మీ గొంతు వినిపించ‌ట్లేదు: చంద్ర‌బాబు

``గ‌తంలో మీరు చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు మౌనంగా ఉంటున్నారు. గెలిచేశాం.. అధికారం లోకి వ‌చ్చేశాం.

By:  Tupaki Desk   |   21 May 2025 1:30 AM
మీ గొంతు వినిపించ‌ట్లేదు: చంద్ర‌బాబు
X

``గ‌తంలో మీరు చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు మౌనంగా ఉంటున్నారు. గెలిచేశాం.. అధికారం లోకి వ‌చ్చేశాం. అని అనుకుంటున్నారా? కానీ.. ప్ర‌త్య‌ర్థులు చేసే వ్య‌తిరేక ప్ర‌చారాన్ని ఎక్క‌డిక‌క్క‌డ ఖండించేందుకు మీరంతా ముందుకురావాలి. నిరంత‌రం మీడియాతో ట‌చ్‌లో ఉండాలి. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు-మ‌న‌కు అనుసంధానం చేసేది ఒక్క మీడియానే. ఈ విష‌యాన్ని మీరు గ‌మ‌నంలో పెట్టుకోవాలి.`` అని తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు కొంద‌రు మంత్రుల‌కు సూచించారు. మంగ‌ళ‌వారం ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. దీనిలో ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.

అనంత‌రం.. మంత్రుల‌తో ప్ర‌త్యేకంగా త‌న ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో వారితో రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల గురించి సీఎం చంద్ర‌బాబు చ‌ర్చించారు. వారికి అప్ప‌గించిన జిల్లాల్లో రాజ‌కీయ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయ‌ని ఆయ‌న ఆరా తీశారు. అంతే కాదు.. మీడియా ముందుకు రావ‌డం లేద‌ని ప్ర‌ధానంగా ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, పొంగూరు నారాయ‌ణ‌, మంత్రి స‌విత‌ల‌ను ప్ర‌శ్నించారు. దేవాల‌యాల గురించి సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రిగింద‌ని.. ముఖ్యంగా సింహాచ‌లం గోడ కూలిన ఘ‌ట‌న త‌ర్వాత‌.. విష ప్ర‌చారం జ‌రిగింద‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఆ స‌మ‌యంలో ఆనం మీడియా ముందుకు ఎక్కువ‌గా వ‌చ్చి ఉంటే బాగుండేద‌న్నారు.

అదేవిధంగా బీసీల విష‌యంపైనా స్పందించే విష‌యంలో మంత్రి స‌విత వెనుక‌బ‌డ్డార‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో రైతుల వ్య‌వ‌హారంపై ప్ర‌తిప‌క్షం చేసిన యాగీని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌డంలో మంత్రి నారాయ‌ణ వెనుక‌బ‌డ్డార‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. ఈజోరు స‌రిపోద‌ని.. మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని ఆయ‌న సూచించారు. ఇక‌, రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల‌ను కూట‌మి నాయ‌కులు కైవ‌సం చేసుకు న్న విధానంపైనా సీఎం చంద్ర‌బాబు ఆరా తీశారు. ఏదైనా కూడా ప్ర‌జ‌ల అభీష్టానికి అనుగుణంగానే న‌డుచుకోవాల‌ని.. ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అయ్యేలా వ్య‌వ‌హ‌రించ‌రాద‌నిఆయ‌న సూచించారు.

అదేస‌మ‌యంలో.. విశాఖ గ్రేట‌ర్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నిక‌, పలు మునిసిపాలిటీల్లో ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా ప‌డ‌డంపై సీఎం చంద్ర‌బాబు సంబంధిత జిల్లా మంత్రుల‌ను ప్ర‌శ్నించారు. ఇలా చేయ‌డం సరికాదని అన్నారు. ప్ర‌జ‌లు క్షేత్ర‌స్థాయిలో పాల‌న‌ను కూడా ప‌రిశీలిస్తున్నార‌ని.. మునిసిపాలిటీలు కూడా ప్ర‌జ‌ల‌కు నిరంత‌రం సేవ‌లు అందించాల‌ని.. చంద్రబాబు అన్నారు. ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు ఇలాంటివి జరగకుండా బాధ్యత తీసుకోవాలని సూచించారు. అయితే.. ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌ని ప‌నిని ఎవ‌రూ చేయొద్ద‌ని స్ప‌ష్టం చేశారు.