మంత్రుల మీద బాబు ఫోకస్...నెక్స్ట్ స్టెప్ ఏంటి ?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అత్యంత అనుభవశాలి. ఏపీకి నాలుగవ సారి సీఎంగా ఆయన వ్యవహరిస్తున్నారు. బాబు అనుభవం ఆయన వయసులో సగం కూడా లేని వారు కొత్త వారు చాలా మంది కేబినెట్ లో మంత్రులు అయ్యారు.
By: Tupaki Desk | 20 May 2025 8:30 AMముఖ్యమంత్రి నారా చంద్రబాబు అత్యంత అనుభవశాలి. ఏపీకి నాలుగవ సారి సీఎంగా ఆయన వ్యవహరిస్తున్నారు. బాబు అనుభవం ఆయన వయసులో సగం కూడా లేని వారు కొత్త వారు చాలా మంది కేబినెట్ లో మంత్రులు అయ్యారు. కూటమి కేబినెట్ కి ఫ్రెష్ లుక్ ఇవ్వడం కోసమే అలా చేసారు. ఇక చూస్తే జూన్ 12 నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తి అవుతుంది. కేబినెట్ లో మొత్తం 24 మంది మంత్రులు ఉంటే ఇందులో జనసేన నుంచి పవన్ తో కలిపి ముగ్గురు, బీజేపీ నుంచి ఒక్కరు ఉన్నారు. మిగిలిన ఇరవై మంది తెలుగుదేశం మంత్రులే.
ఇక కూటమి మత్రివర్గంలో జూనియర్లకు కొత్త వారికీ కీలక శాఖలు లభించాయి. ఇది ఎవరూ ఊహించని విషయమే. తొలిసారి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారికి కూడా మంత్రులు అయ్యే చాన్స్ వచ్చింది అంటే బాబు వారికి ఇచ్చిన అద్భుతమైన అవకాశమే. అలాగే టాప్ ఫైవ్ పోర్టు ఫోలియోలలో కూడా కొన్ని జూనియర్లకు తొలిసారి మంత్రులు అయిన వారికి దక్కాయి.
ఇలా చూస్తే కొత్తదనానికి యువతరానికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని అంటున్నారు. మరి తమకు దక్కిన ఈ గోల్డెన్ చాన్స్ ని ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారు అన్నదే చర్చ. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న నేపధ్యంలో కేబినెట్ సహచరుల పనితీరు మీద బాబు సీరియస్ గానే ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు.
ఆయన స్వయంగా మంత్రులందరి శాఖలలో జరిగిన అభివృద్ధిని వారు చేస్తున్న కార్యక్రమాలను పూర్తి స్థాయిలో మధింపు చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. సాధారణంగా ప్రతీ నెలలో రెండు సార్లు మంత్రివర్గం సమావేశం నిర్వహిచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అలా ప్రతీ కేబినెట్ మీటింగులోనూ మంత్రులకు బాబు దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు.
పనితీరుని మార్చుకోవాలని కొందరికి సూచించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి మంత్రులు తమ శాఖ విషయంలో పూర్తి అవగాహనతో ఉండడమే కాకుండా వినూత్న తరహాలో వాటిలో కార్యక్రమాలను అమలు చేయాలన్నది బాబు మార్క్ ఆలోచన అని చెబుతారు ప్రతీ అంశం మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం ద్వారా ఆయా శాఖలలో జరుగుతున్న అభివృద్ధిని జనాలకు వివరించాలని కూడా బాబు కోరుకుంటున్నారు.
ఇంకో వైపు చూస్తే మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవడమే కాకుండా కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను జనంలో విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా కూటమి పెద్దలు ఆశిస్తున్నారు. ఇక వైసీపీని దాని నుంచి వచ్చే విమర్శలను ధాటీగా ఎదుర్కోవాలని నిజాలు ప్రజలకు ఎప్పటికపుడు చెబుతూ అసత్యాలను ప్రచారం చేసే విపక్షం మీద విమర్శలు చేయడం కూడా మంత్రుల బాధ్యతగా అంటున్నారు.
మరి ఈ విధంగా ఎంతమంది మంత్రులు రాణించారు అన్నదే బాబు మార్క్ మధింపుగా ఉండబోతోంది అని అంటున్నారు. ఏడాది పాటు పనిచేసినా మంత్రుల పనితీరులో ఆశించిన మార్పు రాకపోతే కనుక బాబు సీరియస్ గానే యాక్షన్ లోకి దిగుతారు అని అంటున్నారు. అయితే ఆ యాక్షన్ ఏమిటి అన్నదే సస్పెస్న్ గా ఉంది.
ఏడాది తరువాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులూ ఉంటాయని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే కేవలం ఏడాది వ్యవధిలోనే మంత్రులను మార్చేస్తే విపక్ష వైసీపీకి ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని ఆలోచిస్తున్నారు. అంతే కాదు ప్రజలలో కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు
అందువల్లనే మంత్రులను మార్చకుండా వారి శాఖలలో భారీ మార్పులు చేస్తారని ప్రచారం సాగుతోంది. అంటే కీలకమైన శాఖలు ఇచ్చినా పనితీరు దానిని అనుగుణంగా కనబరచని వారికి వేరే శాఖలు ఇచ్చి పనితీరు మెరుగుపరచుకోమని చెబుతారు అని అంటున్నారు. ఒక విధంగా డిమోషన్ కింద లెక్క అన్న మాట. అప్పటికీ మెరుగుపడకపోతే మార్పులకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు.
అదే సమయంలో బాగా పనిచేస్తున్న వారికి కీలక శాఖలు ఇచ్చి ప్రమోషన్లు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంటుందని అంటున్నారు. చంద్రబాబు పవన్ లోకేష్ కాకుండా మిగిలిన 22 మంది మంత్రుల ప్రొగ్రెస్ రిపోర్టులు అన్నీ బాబు రెడీ చేసి తన వద్ద పెట్టుకున్నారు అని అంటున్నారు. మరి మంత్రుల పనితీరు మీద మధింపులో ఏమి జరుగుతుంది, ఎవరికి మార్కులు ఎవరికి రిమార్కులు అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.