Begin typing your search above and press return to search.

బిగ్ ఇష్యూ... చంద్రబాబుపై హైకోర్టులో సీఐడీ ఫిర్యాదు?

దీంతో... ఆయన మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించారని తెలియజేస్తూ... ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఏపీ సీఐడీ ఉందని కథనాలు వెలువడుతున్నాయి.

By:  Tupaki Desk   |   31 Oct 2023 4:09 PM GMT
బిగ్ ఇష్యూ... చంద్రబాబుపై హైకోర్టులో  సీఐడీ ఫిర్యాదు?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు 52 రోజుల తర్వాత ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు సాయంత్రం చంద్రబాబు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైల్ బయట భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. ఈ సందర్భంగా జైలు నుంచి వస్తున్న బాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో సీఐడీ మరోసారి హైకోర్టులో ఫిర్యాదు చేయనుందని అంటున్నారు.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల రీత్యా షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ లు హైకోర్టు మంజూరు చేసింది. దీంతో జైలు బయట భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణుల నడుమ బాబు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మైకందుకున్న బాబు... తనకు సంఘీభావం తెలిపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ఆ అభిమానాన్ని మరిచిపోలేనని అన్నారు.

ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఆయన... బీజేపీ, సీపీఐ, బీఆరెస్స్, కాంగ్రెస్ పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచారని అన్నారు. ఇదే సమయంలో తన రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పూ చేయలేదని, చేయబోనని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు కోర్టు ఆదేశాలను తుంగలోకి తొక్కినట్లుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

వాస్తవానికి చంద్రబాబు బయటకు రాగానే... రాజమండ్రి నుంచి అమరావతి వరకూ ర్యాలీగా వెళ్లాలని టీడీపీ శ్రేణులు భావించాయని వార్తలొచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ముఖ్యనేతలు కొంతమంది రాజమండ్రి చేరుకోనున్నారు! అయితే ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో ర్యాలీ ఆలోచనను విరమించుకున్నారని అంటున్నారు.

చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఆనంతరం కోర్టు కొన్ని షరతులు విధించింది. ఇందులో భాగంగా... బుధవారం వరకూ ఎటువంటి ర్యాలీలు చేపట్టవద్దని, మీడియాతో మాట్లాడకూడదని తెలిపింది. అయితే... తాజాగా బయటకొచ్చిన చంద్రబాబు... మైకందుకుని మాట్లాడారు! ఈ సందర్భంగా తాను ఏ తప్పూ చేయలేదని తెలిపారు.

దీంతో... ఆయన మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించారని తెలియజేస్తూ... ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఏపీ సీఐడీ ఉందని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో... ఈ విషయంపై కోర్టులో పిటిషన్ వేస్తారా..?, కోర్టు ముందు ఈ వీడియోలు ప్రవేశపెడితే న్యాయస్థానం ఎలా రియాక్ట్ అవుతుంది..? అనేది ఆసక్తిగా మారింది.

కాగా... కేసు మెరిట్స్ పై కాదు కేవలం ఆరోగ్య కారణాల పైనే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ నవంబర్ 28న సాయంత్రం 5 గంటల లోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అవ్వాలని తెలిపింది.