Begin typing your search above and press return to search.

భారత్ మీదకు చైనా యుద్ధానికి వస్తే జరిగేది ఇదే...?

ఇంకో వైపు సిక్కిం తన ప్రాంతంగా చైనా చెప్పుకోవడం అంటే ఢీ కొట్టడానికి రెడీ అవుతోందా అన్న డౌట్లు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 Aug 2023 8:36 AM GMT
భారత్ మీదకు చైనా యుద్ధానికి వస్తే జరిగేది ఇదే...?
X

చైనా అంటే తెంపరితనంతో వ్యవహరిస్తుంది అని ప్రపంచానికి తెలుసు. ఎలా తెలుసు అంటే కరోనా మహమ్మారి తరువాత అమ్మ చైనా అని అనుకోని ప్రపంచ పౌరుడు లేడంటారు. చైనా ఎక్కడో ఉన్న వారికే అలా భయపెడితే సరిహద్దులు పంచుకుంటున్న దేశాలకు ఎలాంటి రిస్క్ ఉండాలి. భారత్ చైనా ఇరుగు పొరుగు దేశాలు.

భారత్ ది ప్రజాస్వామిక పంధా అయితే చైనాది నియంతృత్వ పంధా. బయటకు మాత్రం నీతి సూత్రం వల్లె వేసే నైజం. చైనాకు నిలువెల్లా అక్కసు అన్నది కూడా లోకానికి తెలుసు. ఇక చైనా భూ దాహం సంగతి తెలియని వారు లేరు. చైనాతో సరిహద్దులు పంచుకునే పెద్ద దేశం బుల్లి దేశం అన్న తేడా లేకుండా భూ భాగాలను ఆక్రమించుకోవడం చైనాకు సరదా అనాలో లేక తెంపరితనం అనాలో తెలియదు.

ఇపుడు చైనాకు భారత్ అంటే మంటగా ఉంది. కరోనా తో భారత్ లో అతి పెద్ద ప్రాణ నష్టం జరుగుతుందని దేశం కుదేల్ అవుతుందని అంచనా కట్టిన దేశాలలో చైనా మొట్ట మొదటిది. కానీ చిత్రంగా కరోనా వల్ల దేశంలో ప్రాణ నష్టం అతిగా కాకుండా భారత్ తప్పించుకుంది. అలాగే సకాలంలో స్పందించి వ్యాక్సిన్ తెచ్చి మరీ తనతో పాటు 150 ప్రపంచ దేశాలకు దానిని సరఫరా చేసి ఫార్మసీ ఆఫ్ వరల్డ్ గా మారింది.

అప్పటి నుంచి భారత్ ఎదుగుదల శరవేగంతో సాగుతోంది. భారత్ అంటే అన్ని దేశాలు గౌరవిస్తున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా అయితే మోజు పడుతోంది. ప్రపంచంలో పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలవబోతోంది. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, ఐ ఎం ఎఫ్ . అంతే కాదు అంతర్జాతీయంగా పేరెన్నిక గన్న పలు ఆర్ధిక సంస్థలు.

అలా భారత్ పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్ధిక వృద్ధి రేటు కూడా ఒక స్థాయిలో సాగుతూంటే చైనా అక్కసుతో నిండా రగిలిపోతోంది అని అంటున్నారు. చైనాకు గత కొన్నేళ్ళుగా పరిస్థితి బాగా లేదు అని అంటున్నారు. అక్కడ నిరుద్యోగం నానాటికీ పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం దేశాన్ని పట్టి పీడిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది.

బ్యాంకింగ్ రంగం కూడా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. చైనాలో పరిస్థితులు చూసిన అనేక విదేశీ కంపెనీలు తమ బిచాణాను అక్కడ నుంచి ఎత్తేస్తున్నాయి. ఇక్కడ మరో చిత్రమేంటి అంటే చైనా నుంచి తరలి వెళ్ళిపోయే విదేశీ కంపెనీలు భారత్ వైపుగా వస్తున్నాయి. దాంతో చైనాలో ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది అని అంటున్నారు

ఇక చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ మీద ప్రజలలో పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా ఎక్కువ అవుతోంది. ఆయన నాయకత్వం మీద జనాలు విముఖంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు చైనాను అంతర్గతంగా తీవ్రంగా సతమతం చేస్తున్నాయి.

భారత్ తన పొరుగు దేశంగా ఉంటూ ఇంతలా ఎదిగిపోవడం చైనాకు అసలు నచ్చడంలేదుట. మామూలుగా చూస్తే చైనా ఒక పొజిషన్ లో ఉంటేనే భారత్ అభివృద్ధి చెందడాన్ని సహించదు, ఇపుడు చైనా పరిస్థితి తీసికట్టుగా మారుతున్న వేళ భారత్ ప్రపంచంలో అగ్రభాగాన నిలిచే రేసులో ఉండడం తో మండిపోతోంది. ఇది రెట్టింపు బాధగా చైనాకు ఉందని అంటున్నారు.

అందుకే భారత్ ని దాని శ్రద్ధను దెబ్బ తీయడానికి చైనా భారత్ సరిహద్దులలో తగాదాలు రెడీ అవుతోంది అని అంటున్నారు. భారత్ చైనా సరిహద్దులు ఉన్న అరుణాచల ప్రదేశ్ ని తన దేశం మ్యాపులో చూపించడం లఢక్ తనదే అన్నట్లుగా చెప్పుకోవడం బట్టి చూస్తే చైనా ఆలోచనలు అర్థం అవుతున్నాయని అంటున్నారు. ఇంకో వైపు సిక్కిం తన ప్రాంతంగా చైనా చెప్పుకోవడం అంటే ఢీ కొట్టడానికి రెడీ అవుతోందా అన్న డౌట్లు వస్తున్నాయి.

చైనా ఇలా భారత్ భూభాగాలను తన కొత్త మ్యాపులలో చూపించడం ద్వారా కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిగ్గా ఇదే పరిస్థితి 1962లో జరిగింది అని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కూడా చైనాలో అంతర్గతంగా సమస్యలు ఉన్నాయి. అప్పట్లో కూడా తమ దేశంలో వ్యతిరేకతను కప్పిపుచ్చుతూ కమ్యూనిస్టు పాలకులు భారత్ మీద యుద్ధానికి దిగారు. నాడు భారత్ చినీ భాయీ భాయీ అని భ్రమలలో ఉన్న భారత నాయకత్వం ఈ ఊహించని ఘటనకు ఉక్కిరి బిక్కిరి అయింది. దాంతో ఆ యుద్ధంలో ఓడిపోవాల్సి వచ్చింది.

ఇపుడు పరిస్థితులు అలా లేవని అంటున్నారు. భారత్ గత కొంతకాలంగా చైనాలో సాగుతున్న పరిస్థితులను గమనిస్తోంది. అలాగే సరిహద్దులలో చైనా చేస్తున్న ఆగడాలను గమనిస్తోంది. ఇక భారత్ గత అరవై ఏళ్లలో బాగా బలపడింది. దాంతో చైనా యుద్ధం అంటే మాత్రం భారత్ గట్టిగానే గుణపాఠం చెప్పడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ముద్ను పాకిస్థాను ఉగ్ర శిబిరాల మీద మెరుపు దాడులు చేసింది భారత్.

అది బీజేపీకి ఎంతో రాజకీయ లాభాన్ని తెచ్చింది. ఇపుడు చైనా కనుక కాలు దువ్వితే భారత్ కూడా ఏ మాత్రం సంకోచించకకుండా సమరానికి సై అంటుంది అని అంటున్నారు. నిజంగా అలా జరుగుతుందా లేదా అన్నది చూడాల్సిందే. ఏది ఏమైనా నరేంద్ర మోడీ సర్కార్ మాత్రం చైనా విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని పట్టుదలతో ఉందనే అంటున్నారు. చైనా ఉత్తిత్త బెదిరింపులు అయితే మాత్రం ఓకే కానీ కోరి కయ్యమే అంటే భారత్ నుంచి ఎన్నడూ ఎదురుచూడని సమాధానమే చైనాకు దక్కుతుంది అని అంటున్నారు.