Begin typing your search above and press return to search.

వేధిస్తున్న ఆ మృగాన్ని ముగ్గురు పిల్లలు చంపేశారు

ఢిల్లీలో కలకలాన్ని రేపుతున్న ఈ ఉదంతంలోకి వెళితే.. నిజాముద్దీన్ బస్తీకి చెందిన వారు ఈ ముగ్గురు మైనర్ పిల్లలు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:56 AM GMT
వేధిస్తున్న ఆ మృగాన్ని ముగ్గురు పిల్లలు చంపేశారు
X

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. ముగ్గురు మైనర్లు.. పాతికేళ్ల యువకుడ్ని అత్యంత దారుణంగా చంపేసిన వైనం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాల్ని విన్నంతనే విస్మయానికి గురి కావటం ఖాయం. లైంగిక వేధింపులకు గురి చేస్తున్న యువకుడ్ని.. ఆ వేధింపులకు తాళలేని మైనర్ పిల్లాడితో పాటు అతని ఇద్దరు మైనర్ పిల్లలు కలిసి వాడ్ని దారుణంగా హత్య చేసి.. ఆనవాళ్లు దొరక్కుండా చేసే ప్రయత్నం చేయటం గమనార్హం.

ఢిల్లీలో కలకలాన్ని రేపుతున్న ఈ ఉదంతంలోకి వెళితే.. నిజాముద్దీన్ బస్తీకి చెందిన వారు ఈ ముగ్గురు మైనర్ పిల్లలు. తాము హత్య చేసిన వ్యక్తి వివరాలు తెలీకూడదన్న ఉద్దేశంతో అతడి ముఖాన్ని రాళ్లతో చితగ్గొట్టి.. సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు అతడి బాడీని కాల్చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ముగ్గురు మైనర్లలో ఒకరికి పదిహేడేళ్లు కాగా.. మిగిలిన ఇద్దరు పదహారేళ్ల కుర్రాళ్లు. ఈ ముగ్గురిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చి.. వారిని హోంకు పంపారు.

అసలేం జరిగిందంటే.. అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఈ షాకింగ్ అంశం వెలుగు చేసింది. తాము అజాద్ అనే వ్యక్తిని హత్య చేశామని చెప్పటంతో పాటు.. అతడ్ని ఎక్కడ కాల్చామన్న వివరాల్ని వెల్లడించారు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులకు.. సగం కాలిన వ్యక్తి డెడ్ బాడీ లబించింది.దీంతో.. దాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. అజాద్ పలు సందర్భాల్లో తమలో ఒకరిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా మైనర్లు వెల్లడించారు.

దీంతో.. గురువారం రాత్రి పది గంటల వేళలో.. ముగ్గురు కలిసి అజాద్ పై దారుణంగా దాడి చేసి హత్య చేసినట్లుగా పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకూడదన్న ఉద్దేశంతో అతడి డెడ్ బాడీని కాల్చేసినట్లుగా పేర్కొన్నారు. అజాద్ ను హత్య చేయటానికి వీలుగా చెక్కతో కూడిన వస్తువును.. అతడ్ని గుర్తించలేని రీతిలో ముఖాన్నిచితక్కొట్టేందుకు వాడిన రాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.