Begin typing your search above and press return to search.

బీజేపీ పెద్దలతో చికోటి ప్రవీణ్... తెరపైకి వాషింగ్ పౌడర్ నిర్మా?

హస్తినలో బీజేపీ ముఖ్య నేతలను కలిశారు. బండి సంజయ్, డీకే అరుణ, జయసుధను కలిసిన ఫోటోలు ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి.

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:54 AM GMT
బీజేపీ పెద్దలతో చికోటి ప్రవీణ్... తెరపైకి వాషింగ్  పౌడర్  నిర్మా?
X

గతకొంతకాలంగా మీడియాలో నానుతున్న రాజకీయేతరుల పేర్లలో చీకోటి ప్రవీణ్ కూడా ఒకటని అంటుంటారు. గతంలో క్యాసినో కింగ్ గా చికోటి ప్రవీణ్ పై వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే... ఈయన రాజకీయాల్లోకి రాబోతున్నారని కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలకు తాజాగా బలం చేకూరింది!

అవును... ఇటీవల అనుమతులు లేకుండా గన్స్ క్యారీ చేశారన్న కేసులో ముందస్తు బెయిల్ పై బయటకు వచ్చిన చికోటి ప్రవీణ్... లేటెస్ట్ గా ఢిల్లీలో కనిపించారు. హస్తినలో బీజేపీ ముఖ్య నేతలను కలిశారు. బండి సంజయ్, డీకే అరుణ, జయసుధను కలిసిన ఫోటోలు ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి.

దీంతో చికోటి ప్రవీణ్ త్వరలో బీజేపీలో చేరబోతున్నారంటూ కథనాలు రావడం మొదలయ్యాయి. అవును... ఇటీవల తన పొలిటికల్ ఎంట్రీ పై చికోటి ప్రవీణ్ చేసిన వ్యాఖ్యాల ద్వారా బీజేపీలో జాయిన్ అవ్వడం ఖాయం అన్నట్టుగా తేలిపోయింది. హిందుత్వం అనేది తన రక్తంలోనే ఉందని.. ఒకవేళ రాజకీయాల్లోకి వెళితే బీజేపీలోనే జాయిన్ అవుతానని చీకోటి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో అధికారికంగా బీజేపీలో చేరిన అనంతరం ఎల్బీ నగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నంలో ఏదో ఒక స్థానం నుండి పోటీచేయాలని చికోటి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే సాధారణంగా ఈడీ కేసులు ఎదుర్కొంటున్నవారు, బ్యాంకు రుణాల ఎగవేత దారులు, ఇతర కేసుల్లో ఉన్నవారు బీజేపీ చేరుతున్నారంటూ కథనాలొస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై బీఆరెస్స్ నేతలు "వాషింగ్ పౌడర్ నిర్మా" అనే క్యాంపెయిన్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చీకోటి ప్రవీణ్ కుమార్ బీజేపీలోకి వెళ్లడం కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు.

కాగా... ఇటీవల చికోటి ప్రవీణ్ ప్రైవేట్ గన్‌ మెన్లతో లాల్ దర్వాజ సింహవాహని అమ్మవారి బోనాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. వాళ్ల దగ్గర వెపన్స్ ఉండటంతో.. చికోటి ప్రైవేట్ సెక్యూరిటీని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌ కు తరలించారు.

విచారణ అనంతరం ప్రవీణ్‌ ను ఈ కేసులో ఏ1గా మార్చారు. ఆయన ముగ్గురు గన్‌ మెన్‌ లను రిమాండ్‌ కు తరలించి వారి నుంచి గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రవీణ్ కి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు జులై 26న తీర్పునిచ్చింది.