Begin typing your search above and press return to search.

బాబు కంటి ఆపరేషన్ కు అనుమతి కావాలి... మేటర్ సీరియస్?

అవును... చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలైంది.

By:  Tupaki Desk   |   26 Oct 2023 1:01 PM GMT
బాబు కంటి ఆపరేషన్ కు అనుమతి కావాలి... మేటర్ సీరియస్?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నేటితో సుమారు 47 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనకు ఇంటినుంచి భోజనం, మందులు అందించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో రోజూ మూడుపూటలా బాబుకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో... చర్మ వ్యాదుల కారణంగా వైద్యుల సలహా మేరకు, కోర్టు ఆదేశాల మేరకు బాబుకు ఏసీ అరెంజ్ చేశారు జైలు అధికారులు.

ఈ సమయంలో చంద్రబాబు కంటి సమస్యతో బాదపడుతున్నారని అంటున్నారు! స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు స్నానానికి నీటి సమస్య, దోమల సమస్య, స్కిన్ ప్రాబ్లం సమస్య, ఉక్కబోత సమస్య నుంచి విముక్తి లభించిన నేపథ్యంలో తాజాగా ఆయన కంటి సమస్య తెరపైకి వచ్చింది! ఇందులో భాగంగా... మూడు నెలల క్రితమే చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, దీంతో ఇప్పుడు కుడి కంటికి కూడా ఆపరేషన్ జరపాల్సి ఉందని అంటున్నారు. దీంతో ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అవును... చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలైంది. హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిటీషన్లతో పాటుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను న్యాయవాదులు జత చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని.. అందుకోసం చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుపు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో... చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను ఈనెల 27 నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి అనారోగ్య కారణాలు దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టులో సింగిల్ బెంచ్ ముందు ఎనిమిదవ నంబర్ కేసుగా ఈ బెయిల్ పిటీషన్ లిస్ట్ అయింది.

ఇదే సమయంలో... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు... తన అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటాను భద్రపరచాలని దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై సీఐడీ తరుపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాల్ డేటా ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కాల్ డేటాను ఇవ్వడం వల్ల అధికారుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వాదించారు. దీంతో... అక్టోబర్ 27న మరోసారి వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

మరోపక్క... స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పై తీర్పు నవంబర్‌ 8న రానుండగా... ఏపీ ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ నవంబర్‌ 9న అత్యున్నత న్యాయస్థానం ముందుకు రాబోతుంది. ఇదే సమయంలో ఫైబర్‌ నెట్‌ కేసు పీటీ వారెంట్‌ పై ఏసీబీ కోర్టు నిర్ణయం నవంబర్‌ 10న వెలువడనుందని అంటున్నారు.