టీడీపీలో వైసీపీ కోవర్టులు.. బాబు మాస్ వార్నింగ్!
ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవర్టులు అనే సంచలన విషయం తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
By: Tupaki Desk | 28 May 2025 8:18 AMకడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రసంగించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీలోకి వలస పక్షులు వస్తాయ్.. పోతాయ్.. నిజమైన కార్యకర్త శాస్వతంగా ఉంటాడు అని అన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవర్టులు అనే సంచలన విషయం తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
అవును... మహానాడు కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవర్టులు ఉన్నారని.. తమతో ఉంటూ వాళ్ల టార్గెట్ దిశగా పనిచేస్తున్నారని.. ఇలాంటి తప్పుడు పనులు చెస్తే వారిని వదిలిపెట్టనని అన్నారు. ఈ సందర్భంగా... నేరస్తులూ ఖబడ్దార్.. నా దగ్గర మీటలు సాగనివ్వను అంటూ చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కోవర్టులను మన దగ్గరకి పంపి, ఆ కోవర్టుల ద్వారా మీ ఎజెండా అమలు చేయాలనుకుంటే అది సాధ్యం కాదని.. వలస పక్షులు వస్తాయి, పోతాయని.. నిజమైన కార్యకర్త శాస్వతంగా ఉంటాడని.. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2029లో ఇంతకంటే భారీ మెజారిటీ సాధించాలని చంద్రబాబు కార్యకర్తలను కోరారు!
మనం అన్ని ప్రాంతాల్లో గెలవాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రం అంతా మంచి కార్యక్రమాలు చేస్తున్నామని.. అలాంటప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో గెలిచి, కొన్ని ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు వస్తున్నాయంటే దానికి కారణం అక్కడ ఉండే నాయకత్వం అని.. రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నామని.. ఇలాంటి సందర్భాల్లో మీరు కూడా ఆలోచించాల్సింది ప్రజలు మెచ్చే రాజకీయ పాలన గురించి అని చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి మర్డర్ విషయాన్ని మరోమారు ప్రస్థావించిన చంద్రబాబు... ఈ కడప గడ్డలో చెప్తున్నా వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత నా లాంటి నాయకుడినే మోసం చేయగలిగారని.. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారంటే అందరి మాదిరిగా తాను కూడా నమ్మానని.. ఆ తర్వాత నా మీదనే నెపం వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు ఊహించగలరా అని చంద్రబాబు అన్నారు.
రూమంతా రక్తం ఉంటే కడిగేసి ఏమీ జరగనట్లు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నామో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ఈ సందర్భంగా.. కరుడుగట్టిన నేరస్తులతో మనం రాజకీయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోవర్టులను పంపి మన వేలుతో మన కన్నునే పొడుచుకునేలా చేయాలనుకుంటున్నారని అన్నారు.