ఇక ఎవ్వరూ ఏం చేయలేరు - చంద్రబాబు
అమరావతికి చీకట్లు తొలిగిపోయి.. వెలుగులు ప్రసరించాయన్న చంద్రబాబు.. భవిష్యత్తుపై ఉన్న అనేక అనుమానాలకు ఈ రోజుతో తెరపడిందని పేర్కొన్నారు.
By: Garuda Media | 1 April 2026 10:07 PM ISTఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై లోక్సభలో సుదీర్ఘ చర్చ జరగడం.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం అమరావతికి మద్దతు ఇవ్వడం.. వంటి పరిణామాల పట్ల సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు.. లోక్సభ .. అమరావతి బిల్లుకు మద్దతు తెలిపి.. ఆమోదించింది. ఈ పరిణామాలపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఇది ఏపీ ప్రజలకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
వేలాది మంది రైతులు తమ భూములను త్యాగం చేసి రాష్ట్రానికి అందించారని పేర్కొన్న చంద్రబాబు.. వారి త్యాగాలు వృథా కావని.. పార్లమెంటు సాక్షిగా నిరూపితమైందన్నారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ కొనియాడారని గుర్తు చేశారు. అమరావతిని ఇకపై ఎవరూ కదపలేరన్న చంద్రబాబు.. రాజధాని అజేయమని పేర్కొన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిచేం దుకు కంకణ బద్ధులై పనిచేస్తామన్నారు. దీనిని ప్రపంచ పటంలో నిలుపుతామని తెలిపారు. మద్దతు పలికి అన్నిపార్టీలకూ ధన్యవాదాలు తెలిపారు.
అమరావతికి చీకట్లు తొలిగిపోయి.. వెలుగులు ప్రసరించాయన్న చంద్రబాబు.. భవిష్యత్తుపై ఉన్న అనేక అనుమానాలకు ఈ రోజుతో తెరపడిందని పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో అమరావతి రైతులు పెట్టుకున్న కన్నీరు.. అందరికీ తెలిసిందేనన్నా రు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. ఈ మహత్తర యజ్ఞంలో తమకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా హోం మంత్రి అమిత్షాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇక, రాజధాని అభివృద్ధి అనుకున్న దానికంటే వేగంగా జరుగుతుందని తెలిపారు.
