సీమకు భగీరధుడుగా బాబు !
అంతే కాదు పోలవరం బనకచర్ల పూర్తయితే సీమలో కరువు అనే మాట వినబడదని బాబు నమ్మకంగా చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని అన్నారు.
By: Tupaki Desk | 10 May 2025 3:00 AMరాయలసీమ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని 1956లో ఏర్పాటు తరువాత ఎక్కువగా నష్టపోయింది. తుంగభద్ర నది కర్ణాటకకు వెళ్ళిపోవడంతో సరైన నీటి వనరులు లేక రత్నాల సీమ కాస్తా రాళ్ల సీమగా మారిపోయింది. చిత్రమేంటి అంటే ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీ కానీ సీఎంలు అంతా రాయలసీమ నుంచే అత్యధికంగా వచ్చారు అయినా రాయలసీమకు న్యాయం చేసే విషయంలో అనుకున్నంతగా ప్రయత్నం జరగలేదు అన్న విమర్శలు ఉన్నాయి.
అయితే కోస్తా నుంచి సీఎం అయిన ఎన్టీఆర్ హయాంలో సీమకు కొంత న్యాయం జరిగింది. ఎన్టీఆర్ హంద్రినీవా, గాలేరు, నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులు తెచ్చి సీమ దశదిశా మార్చే ప్రయత్నం చేశారు. ఇక టీడీపీ హయాంలోనే అనేక సాగు నీటి ప్రాజెక్టులకు కదలిక వచ్చింది.
ఇక 2014 నుంచి 2019 మధ్యలో సాగునీటి పధకాలకు టీడీపీ కొంత ఊతమిచ్చింది. ఇక ఇపుడు చూస్తే జూలై 10న హంద్రీనీవా నీరు విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంది. ఈ పనుల పూర్తికి ఏకంగా 3 వేల 873 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అనంతపురం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొదటి దశలో ఒక లక్షా 98 వేల ఎకరాలకు, రెండవ దశలో నాలుగు లక్షల 4 వేల 500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని బాబు చెప్పారు.
అంతే కాదు పోలవరం బనకచర్ల పూర్తయితే సీమలో కరువు అనే మాట వినబడదని బాబు నమ్మకంగా చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని అన్నారు. 2014-19 మధ్యకాలంలో రాయలసీమలో ఇరిగేషన్ కోసమే 70 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని బాబు చెప్పారు. కేవలం ఒక్క రాయలసీమలోనే 12 వేల 441 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు. వీటి నుంచే హంద్రినీవా కోసం 4 వేల 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. ఇక దీని ద్వారా 40 టీఎంసీ నీరు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సీజన్ లోనే పనులు పూర్తి చేస్తామని బాబు ప్రకటించారు.
ఇక హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయితే మొదటి దశలో కర్నూలు జిల్లాలో 77 వేల ఎకరాలకు, నంద్యాల జిల్లాలో మూడు వేల ఎకరాలకు, అనంతపురం జిల్లాలో ఒక లక్షా 18 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక రెండవ దశలో చూస్తే అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ నీటితో హార్టికల్చర్ పంటలు వేసుకుంటే రైతాంగం ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని అంటున్నారు.
మరో వైపు పోలవరం బనకచర్ల పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందని చంద్రబాబు అంటున్నారు. రెండు వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి సముద్రంలోకి పోతోంది. అందులో 300 టీఎంసీ నీరు తెచ్చుకోగలిగితే ఏపీ సస్యశ్యామలం అవుతుందని బాబు చెబుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టు కోసం 81 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని తనకు మనసు ఉందని మార్గం అదే దొరుకుతుందని రాయలసీమకు పూర్తిగా నీరు అందిస్తమని బాబు హామీ ఇస్తున్నారు
పోలవరం నుంచి బనకచర్ల వరకూ నీరు తెస్తే తన జీవితం సార్ధకమవుతుందని కూడా బాబు చెబుతున్నారు మొత్తానికి చూస్తే బాబు రాయలసీమ కోసం భగీరధుడిగా తన వంతు ప్రయత్నాలు చేసి నీటిని పారిస్తున్నారు అని అంటున్నారు.