రాజ్యసభ రాసిచ్చినా సరిపోదు.. !
ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారం భం కానుంది. రాష్ట్రంలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
By: Garuda Media | 23 May 2026 4:00 PM ISTప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనా లప్రకారం.. ఈ నాలుగు స్థానాలను కూడా టీడీపీనే దక్కించుకునే అవకాశం ఉందా? లేక.. పోతే జనసేనకు ఒకటి ఇస్తుందా? అనేది చూడాలి. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీ రెండు.. బీజేపీ 1, జనసేనకు మరొకటి అని అనుకున్నారు.
కానీ.. పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీని పక్కన పెట్టి.. వచ్చే ఏడాది ఖాళీ అవుతున్న(2028) సీట్లలో రెండు ఇచ్చే ప్రతిపాదన దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అయినా.. జనసేన నుంచి చంద్రబాబుపై ఒత్తిడి ఉందని అంటున్నారు. దీంతో జనసేకు ఒకటి ఖాయంగా దక్కనుంది. ఇది పోగా.. మూడు స్థానలను టీడీపీ దక్కించుకోనుంది. అయితే.. ఈ మూడు స్థానాలకు కూడా దాదాపు 30 మందికి పైగానే పోటీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఎవరిని పక్కన పెట్టాలి.. ఎవరికి పెద్దల సీటును కట్టబెట్టాలన్న చర్చ పెద్ద ఇబ్బందిగానే మారింది. అయితే.. ఆయన ఎక్కడా బయట పడడం లేదు. ప్రస్తుతం రాజకీయంగా నెలకొన్న సమీకరణలు.. పార్టీ పరంగా పెంచాల్సిన దూకుడు వంటివి పరిగణనలోకి తీసుకునే దిశగా అడుగులు వేయనున్నట్టు సమాచారం. వాస్తవానికి టీడీపీలో నెలకొన్న పోటీని చూసి.. చంద్రబాబు.. మనకు రాజ్యసభ రాసిచ్చినా..సరిపోయేలా లేదుగా.. అని వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు.. ఆశావహులతో ముఖ్యమంత్రి కార్యాలయం సహా.. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయాలు కిట కిటలాడుతున్నాయి. దీనికితోడు.. కేంద్ర మంత్రులు కూడా.. తమ వారిని పెద్దల సభకు పంపించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా ఇతర పార్టీల్లో ఉన్న టీడీపీ మాజీ నాయకులు కూడా చంద్రబాబును కలుస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం చిక్కుగానే ఉన్నా.. దీనిని సామరస్య పూర్వకంగానే పరిష్కరించి.. సామాజిక, పార్టీ పరంగా కూడా అన్ని కోణాలను చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
