చంద్రబాబు ఏకగ్రీవం.. రేపు లోకేశ్ పట్టాభిషేకం?
లోకేశ్ ప్రమోషన్ పై పార్టీ వర్గాలకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై అధికారిక ప్రకటన మాత్రమే విడుదల కావాల్సివుంది.
By: Tupaki Desk | 28 May 2025 1:29 PMటీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహానాడు సందర్భంగా నిర్వహించిన ఎన్నిక ప్రక్రియలో చంద్రబాబు తప్ప వేరెవరూ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటూ ఎన్నికల అధికారి, వర్ల రామయ్య మహానాడు వేదికగా ప్రకటించారు. 1995లో టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు. తాజాగా మరోసారి ఎన్నిక అవడంతో మరో రెండేళ్ల వరకు చంద్రబాబు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
కడపలో నిర్వహిస్తున్న మహానాడు సందర్భంగా మంగళవారం జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ చేపట్టగా, చంద్రబాబు తప్ప మరెవరూ ఆ స్థానం ఆశిస్తూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో ఆయన ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా ముగిసింది. అయితే యువనేత లోకేశ్ ను పార్టీ వర్కింగు ప్రెసిడెంటుగా నియమించాలని రెండో రోజు మహానాడులో పలువురు నేతలు డిమాండ్ చేశారు.
లోకేశ్ ప్రమోషన్ పై పార్టీ వర్గాలకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై అధికారిక ప్రకటన మాత్రమే విడుదల కావాల్సివుంది. మహానాడు వేదికగానే ఈ నియామకం ప్రకటన ఉంటుందా? లేక తర్వాత పార్టీ కార్యవర్గం ప్రకటన చేసేటప్పుడు లోకేశ్ పదవిపై క్లారిటీ ఇస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే గురువారం జరిగే బహిరంగ సభలో ఐదు లక్షల మంది కార్యకర్తల సమక్షంలో లోకేశ్ పదవిపై ప్రకటన ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక చంద్రబాబు తరఫున అధ్యక్ష పదవికి మొత్తం 30 సెట్ల దరఖాస్తులు అందడం విశేషం. అదే సమయంలో నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, ధూలిపాళ్ల నరేంద్ర, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గొండు శంకర్ తోపాటు పార్టీ నేతలు ఆనం రామనారాయణరెడ్డి, టీడీ జనార్దన్ ప్రతిపాదించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంలో ఏం చెబుతారనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.