బాబు కోరిక సబబే...జనాలు ఆలోచన ఏమిటో ?
టీడీపీ అధినేత చంద్రబాబు మనసులో ఉన్నది చెప్పేసారు. ఆయన మహానాడు వేదికగా పార్టీ జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ సభాముఖంగా అయిదు కోట్ల ఆంధ్ర జనాలకూ విన్నపం చేశారు.
By: Tupaki Desk | 30 May 2025 7:20 AMటీడీపీ అధినేత చంద్రబాబు మనసులో ఉన్నది చెప్పేసారు. ఆయన మహానాడు వేదికగా పార్టీ జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ సభాముఖంగా అయిదు కోట్ల ఆంధ్ర జనాలకూ విన్నపం చేశారు. అది కూడా అభివృద్ధిని జత చేర్చి మరీ స్పష్టంగా చెప్పారు. ఏపీలో అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలీ అంటే అయిదేళ్ళకు ఒకసారి ప్రభుత్వాన్ని మారుస్తే కుదరదు అన్నారు. ఏకంగా కొన్ని టెర్ముల పాటు అధికారం అలా టీడీపీకి దఖలు పడేలా చూడాలని కూడా కోరారు.
అంటే బాబు ఉద్దేశ్యంలో ఎన్నికలు అన్నది జస్ట్ లాంచనప్రాయంగా ఉండాలన్న మాట. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు తెలుగుదేశం పార్టీనే గెలిపించాలని ఆయన అంటున్నారు. అలా టీడీపీని వదులోరాదని ఆయన విన్నవిస్తున్నారు. మధ్యలో టీడీపీ చేయి జనాలు వదిలేస్తే అది పార్టీకి రాజకీయంగా చేసే నష్టం కంటే ఏపీకి అభివృద్ధి పరంగా చేసే నష్టం అధికంగా ఉంటుందని కూడా ఆయన అంటున్నారు.
ఇక ఏపీలో 2019 నుంచి 2024 మధ్యలో పాలన సరిగ్గా లేదని అరాచకం సాగిందని, అలాగే అభివృద్ధి పూర్తిగా కుంటుబడిందని చెప్పుకొచ్చారు. దానిని సరి చేసుకుని ఒక గాడిన రాష్ట్రాన్ని తీసుకుని రావడానికి తాను ఎంతగానో శ్రమిస్తున్నాను అని బాబు అంటున్నారు మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకుని రావద్దని జనాలను వేడుకుంటున్నారు.
అధికారం మార్పిడి వల్ల అభివృద్ధి అన్నది వైకుంఠపాళి లో పాముని మింగిన మాదిరిగా నేలకు దిగజారడం మంచిది కాదని హితవు చెబుతున్నారు. సరే బాబు విన్నపం సబబే అనుకున్నా జనాల ఆలోచనలు ఎలా ఉంటాయో అన్నది చర్చగా ఉంది. 1983 నుంచి ఉమ్మడి ఏపీలో కానీ విభజన ఏపీలో కానీ చూసుకుంటే కనుక ప్రతీ అయిదేళ్ళకు అధికారం మార్పిడి జరుగుతూ వస్తోంది. దానికి 1999, 2009 ఎన్నికలే మినహాయింపు.
ఇక 1983 దాకా ఏపీలో ఒకే పార్టీ ఉండేది. అలా స్వాతంత్ర్యం వచ్చాక మూడున్నర దశాబ్దాల పాటు ఏకధాటిగా కాంగ్రెస్ ఉమ్మడి ఏపీని ఏలింది. అయితే టీడీపీ పేరుతో ఒక బలమైన ఆల్టర్నేషన్ రావడంతో జనాలు ఆ వైపు మళ్ళారు. అలా 1983లో టీడీపీ నెగ్గింది. నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ మధ్యలో జరగకపోయి ఉంటే 1988లో జరిగే ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెంది కాంగ్రెస్ వచ్చేదని అప్పటి రాజకీయ విశ్లేషకులు చెబుతూంటారు.
ఇక అది 1989లో అలాగే జరిగింది. ఎన్టీఆర్ మీద మోజు తగ్గి కాంగ్రెస్ ని జనాలు గెలిపించారు. తిరిగి 1994లో కాంగ్రెస్ ని ఓడించి ఎన్టీఆర్ కి పట్టం కట్టారు. 1999లో లెక్క ప్రకారం కాంగ్రెస్ కి పగ్గాలు అందాలి. కానీ బీజేపీతో పొత్తు వాజ్ పేయి ఒక్క ఓటుతో అధికారం కోల్పోయారు అన్న సానుభూతి, కార్గిల్ వార్ ఎమోషన్స్ అన్నీ పొత్తు పార్టీగా టీడీపీకి కలిసి రావడంతో చంద్రబాబు గెలిచారు. అయితే అది కూడా పెద్దగా మార్జిన్ తో కాదు, తక్కువ సీట్లతోనే.
ఇక 2004 నాటికి రాజకీయ సన్నివేశం పూర్తిగా మారిపోయింది. వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచింది. 2009 నాటికి చూస్తే కచ్చితంగా టీడీపీ గెలవాలి. కానీ మధ్యలో ప్రజారాజ్యం రావడంతో ఓట్లు చీలి బొటాబొటీ మెజారిటీతో కాంగ్రెస్ గద్దెనెక్కింది.
ఇక 2014లో విభజన ఏపీలో చూస్తే తొలి టెర్మ్ టీడీపీ మంచి మెజారిటీతో గెలిస్తే రెండవ టెర్మ్ 2019లో వైసీపీ భారీ విజయంతో అధికారం అందుకుంది. ఇక 2024లో చూస్తే అంతకు మించి అన్నట్లుగా టీడీపీ కూటమిని జనాలు గెలిపించారు. ఇక 2029 గురించి చూస్తే జనాలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నదే చర్చగా ఉంది. ప్రతీ అయిదేళ్ళకూ అధికార మార్పిడి అన్నది ఏపీ ప్రజలు అలవాటు చేసుకున్న రాజకీయ సూత్రం. అందువల్ల వైసీపీ తామే అధికారంలోకి వస్తామని ఆశపడుతోంది. దానిని బ్రేక్ చేయడానికి టీడీపీ చాలా వ్యూహాలనే రచిస్తోంది. ఇంకా చేస్తుంది కూడా.
అయితే ఆంధ్రులు అల్ప సంతోషులు కారు అన్నది ఒక మాట. అంతే కాదు వారు ఆప్షన్లు ఎపుడూ చూస్తారు అన్నది మరో మాట. దాంతో ఎంత బాగా చేసినా ఒక పార్టీకి ఒక టెర్మ్ మాత్రమే చాన్స్ అన్నది కనుక ఫిక్స్ అయితే ఈ విన్నపాలు ఏమవుతాయన్నది చూడాల్సిందే. అలా కాదు అని కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం బాబుకు బంపర్ ఆఫర్ దొరికినట్లే అని భావించాలి.