కూటమి ప్రభుత్వంపై పాజిటివిటీ పెరిగిందా..!
తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పార్టీ నాయకులకు ఆయన ఇదే విషయంపై దిశానిర్దేశం చేశారు.
By: Tupaki Desk | 6 May 2025 2:30 AMకూటమి ప్రభుత్వం ఏర్పడి 11 మాసాలు పూర్తవుతున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే.. మరో 35 రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పార్టీ నాయకులకు ఆయన ఇదే విషయంపై దిశానిర్దేశం చేశారు. పార్టీ వరుసగా అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ముడి సరుకులను ఇప్పటి నుంచే సేకరించనున్నారు.
దీనిలో ప్రధానంగా ప్రజలను కట్టుతప్పకుండా.. పార్టీకి చేరువ చేయడంలో పార్టీ నాయకులను బలోపేతం చేస్తారు. ఈ క్రమంలో పాజిటివిటీని పెంచేందుకు.. ప్రస్తుతం ఉన్న పాజిటివిటీని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. దీనిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తారు. పార్టీ ని మండలస్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు పుంజుకునేలా చేయడంలో సక్సెస్ అయినట్టే.. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా.. అలానే చేయనున్నారు.
కూటమి ప్రభుత్వంపై ప్రస్తుతం ప్రజల్లో పాజిటివిటీ ఉంది. దీనిని మరింత పెంచనున్నారు. ఇస్తున్న పథకాలు, చేస్తున్న సంక్షేమాన్ని మరింతగా ప్రజలకు వివరించనున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ క్రమంలో వలంటీర్లను వినియోగించుకున్నట్టే.. త్వరలోనే పార్టీ తరఫున కూటమి పార్టీల నుంచి కూడా.. కార్యకర్తలను తీసుకుని టీములను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా.. నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారు వారధులుగా ఉండేలా చేస్తారు.
అలానే.. పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న పనులను పర్యవేక్షించేందుకు సీనియర్లతో కూడా కమిటీ లను వేయనున్నారు. వీరు నిత్యం పార్టీ కార్యక్రమాలకు తోడు ప్రజల తరఫున సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించేలా అధికారులకు సూచనలు, సలహాలు చేయనున్నారు. తద్వారా పార్టీలో ఎక్కడైనా చిన్నపాటి లోపాలు ఉన్నా.. వాటిని పరిష్కరించి.. ప్రజల్లో పాజిటివిటీని తగ్గకుండా.. మరింత పెంచేలా వ్యూహాత్మకంగా ప్రణాళికాయుతంగా ముందుకు సాగనున్నారు.