వ్యూహాలు ఇప్పుడే ఎందుకు... టీడీపీలో చర్చ... !
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు చేరువ చేయాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.
By: Garuda Media | 19 March 2026 8:00 AM ISTప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు చేరువ చేయాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. నాయకులు ప్రజలకు దగ్గర కావాలని.. కూటమి పాలనను అర్ధమయ్యేలా ప్రజలకు వివరించాలని కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ.. ఇది మానేసిన చాలా మంది నాయకులు వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. వ్యూహాలు వేస్తున్నామని చెబుతున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికలకు చాలానే సమయం ఉంది.
అంతేకాదు.. మూడేళ్ల సమయంలో అనేక మార్పులు.. అనేక అంశాలు కూడా చోటు చేసుకుంటాయి. కానీ.. ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలు రెడీ చేసుకుంటున్నామన్న కారణంగా.. ప్రజల కు దూరంగా ఉంటున్నారని.. ప్రభుత్వం చేపడుతున్న పనులును ప్రజలకు వివరించడం లేదని అనేక రూపాల్లో సీఎం చంద్రబాబుకు నివేదికలు అందాయి. ఈ నివేదికలపై చంద్రబాబు నిశితంగా దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు ఎందుకు ప్రజలకు చేరువ కావడం లేదన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు.
కానీ, ఇప్పుడు తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి.. వ్యూహాలు రెడీ చేసుకుంటున్నట్టు తెలిపారు. అయితే.. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడే వ్యూహాలు ఎందుకు? అసలు మీకు ఈ విషయంపై ఎక్కువ ఇంట్రస్ట్ ఎందుకు? అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రస్తుతం ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరగకుండా చూసుకోవాలని కూడా సూచించారు. తాజాగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించారు.
మెజారిటీ నాయకులు ప్రజలకు చేరువగా ఉండకుండా.. తమ పనులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెబుతున్నారు. అంతే కాదు.. రూపాయి వెనుకేసుకుంటున్నారని.. తద్వారా వచ్చే ఎన్నికలకు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారని నివేదికలు అందాయి. కానీ, ఇవి సరికాదని చంద్రబాబు తెలిపారు. ముందు ప్రభుత్వం, కూటమి పార్టీల మధ్య సఖ్యత వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు. తద్వారా ప్రజల అభిమానం సొంతం చేసుకోవాలని సూచించారు. మరి ఎంత మంది పాటిస్తారో చూడాలి.
