పొగుడుతున్నారు.. పనికావట్లేదు: చంద్రబాబుకు చింత!
ఏపీ సీఎం చంద్రబాబుకు చింత పట్టుకుంది. ఇది ప్రయోజనకరమైన చింతే అయినా.. ఆయన కొంత అంతర్మథనం చెందుతున్నట్టు అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 23 April 2025 5:30 PMఏపీ సీఎం చంద్రబాబుకు చింత పట్టుకుంది. ఇది ప్రయోజనకరమైన చింతే అయినా.. ఆయన కొంత అంతర్మథనం చెందుతున్నట్టు అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి.. 10 మాసాలు పూర్తయింది. ఇప్పటి వరకు చంద్రబాబు 18 సార్లు.. ఢిల్లీకి వెళ్లారు. ఆయన కీలకమైన రెండు మూడు అంశాలను కేంద్ర పెద్దల వద్ద ఉంచుతున్నారు. ``మీరు ఎలా కావలంటే.. అలా చేసేందుకు మేం సిద్ధం. కానీ... ఈ మూడు విషయాలను మీరు నెరవేర్చాలి`` అని కోరుతున్నారు.
అయితే..చంద్రబాబుకు హామీలు దక్కుతున్నంత తేలికగా.. పనులు ముందుకు సాగడం లేదన్న ఆవేదన, బాధ నెలకొన్నాయి. దీనికి కారణం.. ఈ మూడు ప్రాజెక్టుల అంశాన్ని కూడా.. కేంద్ర ప్రభుత్వం తేల్చడం లేదు. పైకి మాత్రం చంద్రబాబును మంత్రులు అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ``ఈయన మన్నకన్నా సీనియర్. మనం రేపటి గురించి ఆలోచిస్తాం. కానీ,.. చంద్రబాబు 25 ఏళ్ల ముందుకు ఆలోచిస్తారు. హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఇలా ఉందంటే.. చంద్రబాబే కారణం`` అని తాజా పర్యటనలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కొనియాడారు.
కానీ, ఆయన చేతిలోనే ఉన్న కీలక విషయం.. హైకోర్టు తాలూకు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకుఉత్తర్వులు ఇవ్వడం. ఇది మాత్రం ఆయన చేయడం లేదు. తాజా పర్యటనలోనూ మరోసారి చంద్రబాబు ఇదే విషయాన్ని ఆయనకు విన్నవించారు. ఇక, రెండో పోలవరం. ఈ విషయంపై కూడా.. మరోసారి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా.. చంద్రబాబు దూరదృష్టిని వేనోళ్ల కొనియాడారు. కానీ.. అంతా మేం చూసుకుంటాం.. అని ముక్తసరి సమాధానం చెప్పి పంపించారు.
ఇక, అత్యంత కీలకమైన మూడో అంశం.. అమరావతిలో కేంద్ర ప్రాజెక్టుల ఏర్పాటు.. ఈ విషయం వాస్తవానికి విభజన చట్టంలోనే ఉంది. అయినా.. కేంద్రం తాత్సారం చేస్తూనే ఉంది. దీనిపై తాజాగా మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సూచించారు.. ఆయన కూడా.. మీరు చెప్పాక కాదంటామా? అని చిరునవ్వురువ్వారు. ఇలా.. కేంద్రం నుంచి సానుకూల పవనాలు వీసన్తున్నాయే తప్ప.. చంద్రబాబు ఆశించిన విధంగా అయితే.. పనులు ముందుకు సాగకపోవడంతో ఆయనలో చింత తీరడం లేదని అంటున్నారు అత్యంత సన్నిహితులు..