Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఎక్స్ పీరియన్స్ ప్రభుత్వ భూములు అమ్మడమా? వైసీపీ సెటైర్లు

40 ఇయర్స్ పాలిటిక్స్ అని అవిభాజ్య ఏపీ విడిపోగానే ఏపీ ప్రజలంతా చంద్రబాబుకు ఓట్లు వేసి గెలిపించారు.

By:  Tupaki Desk   |   8 May 2025 9:00 PM IST
Government Lands to Clear Debts? Chandrababus Plan Sparks Controversy
X

40 ఇయర్స్ పాలిటిక్స్ అని అవిభాజ్య ఏపీ విడిపోగానే ఏపీ ప్రజలంతా చంద్రబాబుకు ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడు 2024లోనూ చంద్రబాబు అనుభవం ప్రాతిపదికగానే ప్రజలు పట్టం కట్టారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సూపర్ 6 వంటివి ప్రభుత్వానికి భారం అవుతోంది. ఇదే ప్రత్యర్థులకు, ప్రతిపక్ష వైసీపీకి అవకాశం మారుతోంది. తాజాగా చంద్రబాబు చేసిన ప్రభుత్వ భూముల అమ్మకంతో మరింతగా విమర్శల జడివాన కురుస్తోంది. బాబు వీడియోను షేర్ చేస్తూ వైసీపీ సోషల్ వార్ ను ఉధృతం చేస్తోంది.

అమరావతిలో 4000 ఎకరాల ప్రభుత్వ భూములను అమ్మితే రాష్ట్ర అప్పులు తీరిపోతాయని, ఆంధ్రప్రదేశ్‌కు అప్పులే ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ప్రభుత్వ భూములను అమ్మడానికేనా అంటూ వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.

ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని, ఆ సంపదను ప్రజలకు పంచుతానని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సంపద సృష్టించడంపై దృష్టి పెట్టకుండా, రాష్ట్రానికి ఉన్న ప్రభుత్వ భూములను అమ్మి అభివృద్ధి చేయాలని చూడటం విడ్డూరమని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇదేనా చంద్రబాబు దశాబ్దాల అనుభవం అంటూ నిలదీస్తున్నారు.

ఇంత సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పుంజుకోవాల్సింది పోయి, ఉన్న భూములు అమ్ముకునే దుస్థితికి చేరుకుందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు అనుభవంతో సంపద సృష్టి కాకుండా, రాష్ట్రం మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని విమర్శిస్తున్నారు. అమరావతి వంటి విలువైన ప్రాంతంలో వేల ఎకరాల భూమిని అమ్మడం దీర్ఘకాలంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ భూములను భవిష్యత్ అవసరాల కోసం, ఆదాయ వనరుల సృష్టి కోసం కాపాడుకోవాల్సిన ప్రభుత్వం, వాటిని అమ్మి అప్పులు తీర్చడం ఏంటని వైసీపీ పేర్కొంటోంది. చంద్రబాబు అనుభవం కేవలం భూముల అమ్మకంపైనే కేంద్రీకృతమై ఉందని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై కాదని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ చర్యల ద్వారా చంద్రబాబు తన అనుభవాన్ని మరోసారి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడానికే ఉపయోగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.