బాబు ఎఫెక్ట్: మత్స్యాకారులకు భరోసా దక్కినట్టేనా ..!
అదే సమయంలో కీలకమైన సమస్యను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సందర్భంగానే ఆయన సినిమా టిక్ డైలాగులతో మత్స్యకారులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
By: Garuda Media | 21 May 2026 5:00 AM ISTఏపీ సీఎం చంద్రబాబు తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. మత్స్యకార సేవలో కార్యక్రమంలో భాగంగా వేట నిషేధసమయంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.20 వేల రూపాయలను ఆయా కుటుంబాల ఖాతాల్లో జమ చేశారు. అదేసమయంలో కీలకమైన సమస్యను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సందర్భంగానే ఆయన సినిమా టిక్ డైలాగులతో మత్స్యకారులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వేట మనదే.. ఓటు మనదే.. అంటూ వారిని ఉత్సాహ పరిచారు.
ఇక, పొరుగు రాష్ట్రం తమిళనాడుకు కూడా పనిలో పనిగా వార్నింగ్ ఇచ్చేశారు. ఎవరి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుందని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు. కట్ చేస్తే.. మత్స్యకారుల సమ స్య పరిష్కారం అయిందా? అనేది ప్రశ్న. అసలు సమస్యను చంద్రబాబు ప్రస్తావించినట్టేనా? సమస్యకు పరిష్కారం చూపించినట్టేనా? అనేది సందేహంగానే మిగిలిపోయింది. ఇది.. ఎవరో పుట్టించిన సందేహాలు కాదు.. చంద్రబాబు పర్యటన ముగిసన తర్వాత.. అదే ప్రాంతంలో మత్స్యకార వర్గానికి నేతృత్వం వహిస్తున్న సంఘాలు భేటీ అయ్యాయి.
చంద్రబాబు వ్యాఖ్యలు.. ఆయన ఇచ్చిన వార్నింగులపై పెద్ద ఎత్తున చర్చించారు. చివరకు పెదవి విరిచా రు. తమ పోరాటం ఆగదని కూడా సెలవిచ్చారు. దీంతో అసలు సమస్య ఏంటి? అనేది ఆసక్తిగామారింది. ఇప్పుడంటే..వేట నిషేధ సమయం కాబట్టి.. మరో నెల రోజులకు పైగానే ఎలాంటి సమస్యారాదు. కానీ, అసలు సమస్య వేరే ఉంది. తమిళనాడు నుంచి వస్తున్న జాలర్లు.. భారీ మరపడవలతో ఇక్కడ వేట సాగిస్తున్నారు. ఇదే అసలు సమస్య. అయితే.. చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు కదా!. అనే ప్రశ్న ఉంటుంది.
కానీ, దండలో దారంలా.. ఇక్కడ మరో సమస్య ఉంది. తమిళ జాలర్లకు స్థానికంగా ఉన్న కొందరు టీడీపీ నాయకులు.. అండగా ఉన్నారన్నది అసలు సమస్య. గతంలో ఇదే తీవ్ర వివాదానికి కూడా దారి తీసింది. తమిళ జాలర్ల నుంచి స్థానిక నెల్లూరు మత్స్యకారులు స్వాధీనం చేసుకున్న నాలుగు మర పడవలను ఓ టీడీపీనాయకుడు జోక్యం చేసుకుని రాత్రికి రాత్రి వాటిని వారికి అప్పగించారు. పైగా ఇక్కడి వారిపైనే కేసులు పెట్టించారు. ఇదీ.. అసలు సమస్య. అయితే.. చంద్రబాబు ఈ విషయాన్ని వదిలేశారన్నది మత్స్యకార సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరి దీనిపై చంద్రబాబు పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే.. వివాదం అలానే కొనసాగుతుందని చెబుతున్నారు.
