Begin typing your search above and press return to search.

పేదలతో డైరెక్ట్ కనెక్షన్...బాబు మార్క్ భావోద్వేగం

ముఖ్యమంత్రి చంద్రబాబు గడచిన రెండేళ్ళుగా ఏపీలో చేస్తున్న పర్యటనలు తీసుకుంటున్నా కార్యక్రమాలు ఇస్తున్న స్లోగన్స్ చూస్తూంటే డైరెక్ట్ కనెక్షన్ విత్ ద పూర్ అన్నది బాగా అర్ధం అవుతుంది.

By:  Satya P   |   20 May 2026 9:35 AM IST
పేదలతో డైరెక్ట్ కనెక్షన్...బాబు మార్క్ భావోద్వేగం
X

ముఖ్యమంత్రి చంద్రబాబు గడచిన రెండేళ్ళుగా ఏపీలో చేస్తున్న పర్యటనలు తీసుకుంటున్నా కార్యక్రమాలు ఇస్తున్న స్లోగన్స్ చూస్తూంటే డైరెక్ట్ కనెక్షన్ విత్ ద పూర్ అన్నది బాగా అర్ధం అవుతుంది. పేదలతో నేరుగా అనుసంధానం అవడానికి బాబు ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు అన్నది బోధపడుతుంది. బాబు గతంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినా కూడా ఇంతలా పేదలతో మమేకం అయ్యవారు కాదు. కానీ నాలుగవ సారి సీఎం అయ్యాక బాబులో విపరీతమైన మార్పు వచ్చింది. ఆయన పేదల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. వారి విషయంలోనే ఫోకస్ పెడుతున్నారు. తన జిల్లాల పర్యటనలలో ప్రత్యేకించి పేదల ఇంటికి వెళ్తున్నారు. వారితోనే గడుపుతున్నారు. వారు తినే తిండినే ఆయన తింటున్నారు. ఇవన్నీ కూడా బాబు వారితో పెనవేసుకుంటున్నా భావోద్వేగాల బంధానికి నిదర్శనం అని అంటున్నారు.

ఆశ్చర్యపరచిన బాబు :

ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పేద మత్స్యకారుడి ఇంటికి వెళ్ళి అక్కడ ముక్కాలి పీట మీద కూర్చుని వారు వండిన భోజనం తిన్నారు అంటే ఆశ్చర్యమే. అంతే కాదు ఆయన స్వయంగా ఆ ఇంట్లో వంట గదిలోకి వెళ్ళి మరీ ఆ ఇంటావిడ చేస్తున్న వంటకు సాయం చేయడం గరిట తిప్పడం ఇవన్నీ కూడా ఆయనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ఇక ఆ ఇంటి పిల్లలతో మాట్లాడుతూ వారి బాగోగుల గురించి ఆరా తీయడం భరోసా ఇవ్వడం వంటివి కేవలం అక్కడికే పరిమితం కావు. ఏపీ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పేదలను కదిలిస్తాయి. వారిలో సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి.

బాబు చేసిన సందడి :

ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని సముద్ర తీర గ్రామం తుమ్మలపెంటలో ఒక పేద మత్స్యకారుడి ఇంట్లో బాబు కొంత సేపు గడిపి సందడి చేశారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమం అనంతరం బాబు తుమ్మలపెంటలో మత్స్యకారుడు తానం గారి బాబు అనే మత్స్యకారుడి ఇంటికి వెళ్లి స్వయంగా వారి కష్టం అంతా తెలుసుకున్నారు. ఆ గ్రామంలోని చేపలు విక్రయిస్తున్న కొందరు మత్స్యకార మహిళలతో ముచ్చటించిన బాబు చేపలు, రొయ్యల విక్రయం ఎలా జరుగుతోందని వారి నుంచే జవాబులు రాబట్టారు. ఇక ఆ మహిళల నుంచి చేపను కొనుగోలు చేసి మత్స్యకారుడు తానంగిరి బాబుకు ఆయన ఇచ్చారు.

మీరే చెప్పాలంటూ :

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా వారి కుటుంబ పెద్దగా బాబు వ్యవహరించారు. మీ జీవితాలలో మార్పు రావాలంటే ఏం చేయాలని బాబు ప్రశ్నించారు. దానికి వారంతా తమకు వలలు, బోట్లు లాంటి మౌలిక సదుపాయాలు అవసరమని చెప్పరు. దాంతో 200 మెకనైజ్డ్ బోట్లు మత్స్యకారులకు ఇచ్చేలా ఆలోచన చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. ఆ తరువాత మత్స్యకారుడు తానం గిరి బాబు ఇంటికి వెళ్లి అక్కడ ఆ కుటుంబం చేపలకూర వండి వడ్డించిన తీరుని అంతా గమనించారు. వారితో పాటే తానూ భోజనం చేశారు. అలా వారి కుటుంబంతో కలిసి కిందనే కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు ఒక మంచి గుర్తుని వారికి మిగిల్చారు.

పేదల ముంగిటకు ప్రభుత్వం :

అంతే కాదు పేదల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేశారు. ఇలా చంద్రబాబు తన జిల్లాల పర్యటనలో పేదల గడపలకు వెళ్తూ వారితో ముచ్చటిస్తున్న తీరు నిజంగా గొప్పదే అని అంటున్నారు. ఎన్ని పాదయాత్రలు చేసినా ఎంతగా మమేకం అయినా ఇలాంటి అనుభవాలే ఎక్కువ విషయాలు తెలియచేస్తాయని పేదలకి సైతం ఎంతో సంతృప్తిని భరోసాను ఇస్తాయని అంటున్నారు. అందుకే బాబు ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా తానే పేదల ఇళ్ళకు వెళ్తున్నారు. మరి ఆయన బాటలో మంత్రులు ఎమ్మెల్యేలు అంతా తమ ప్రాంతాలలో పేదల ఇళ్లకు వెళ్ళి ఇలా చేస్తే పేదల ముంగిటకు ప్రభుత్వం వచ్చినట్లే అవుతుంది కదా అని అంటున్నారు.