Begin typing your search above and press return to search.

ఢిల్లీలో బాబు బిజీ బిజీ !

ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం విదేశాలలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వజ్రోత్సవ జన్మ దినాన్ని ఈసారి ప్రత్యేకంగా ఫారిన్ లో చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   21 April 2025 2:30 PM
ఢిల్లీలో బాబు బిజీ బిజీ !
X

ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం విదేశాలలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వజ్రోత్సవ జన్మ దినాన్ని ఈసారి ప్రత్యేకంగా ఫారిన్ లో చేసుకున్నారు. బాబుకు ఇది 75వ జన్మదినం ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్. దాంతోనే ఆయన ఎన్నడూ లేని విధంగా విదేశాల్లో తన పుట్టిన రోజు ఉత్సవాలను జరుపుకున్నారు.

ఇదిలా ఉంటే బాబు ఊసు లేకుండా ఆయన మాట వినకుండా ఏపీలో నాలుగైదు రోజులు గడచిపోయాయి. మామూలుగా అయితే ఏపీకి దూరంగా ఉండరు. ఇపుడు కీలకమైన సందర్భం కాబట్టే అలా దూరం వెళ్ళారు. అయినా సరే కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఆయన తిరిగి వస్తున్నారు.

ఇక చంద్రబాబు వస్తూనే ఫుల్ బిజీ కానున్నారు. ఆయన మంగళవారం షెడ్యూల్ అంతా ఢిల్లీలో ఫుల్ బిజీగా మారబోతోంది. బాబు సోమవారం రాత్రికి ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. మంగళవారం ఆయన తన విధులలో పూర్తిగా నిమగ్నం కానున్నారు.

ఆయన వరసబెట్టి కేంద్ర మంత్రులతో భేటీలు వేయనున్నారు. ఈ మేరకు ఆయా మంత్రుల అపాయింట్మెంట్లు ఖరారు అయ్యాయని అంటున్నారు. ఆయన తొలుత కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఅర్ పాటి లో భేటీ అవుతారు. ఏపీలో పోలవరం తరువాత బాబు మానస పుత్రిక అయిన బనకచర్ల ప్రాజెక్ట్ కోసం కేంద్ర మంత్రితో చర్చిస్తారు అని అంటున్నారు.

ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే ఏపీ సశ్యశ్యామలం అవుతుంది. ఏపీలో ఉన్న కీలకమైన ప్రాంతం రాయలసీమకు సాగు తాగు నీరు గోదావరి మిగులు జలాల తరలింపు ద్వారా ఈ పధకం తో అందిస్తారు. ఈ పధకానికి డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా వేశారు మరి దానిని అవసరం అయిన నిధులను సమకూర్చాలని కేంద్రాన్ని ఈ భేటీ సందర్భంగా బాబు కోరుతారు అని అంటున్నారు. అలాగే ఈ పధకానికి అనుమతులు కూడా కేంద్రం నుంచి బాబు కోరనున్నారు.

మరో వైపు చూస్తే కనుక కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో కూడా చంద్రబాబు భేటీ అవుతారని చెబుతున్నారు. ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలను ఆయనతో చర్చిస్తారు అని తెలుస్తోంది. ఇక కీలకమైన ప్రధానమైన భేటీని ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఇద్దరు నాయకులూ ఏమి మాట్లాడుతారు అన్నది చర్చగా ఉంది.

అదే విధంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా బాబు భేటీ అవుతారని అంటున్నారు. ఇలా కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలు ఇతర అభివృద్ధి పనులపై చర్చించనున్నారని అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరడమే ఈ భేటీల వెనక ముఖ్య ఉద్దేశ్యం అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక చంద్రబాబు ఫారిన్ టూర్ నుంచి వస్తూనే ఫుల్ బిజీ కానున్నారు అన్న మాట.