విశాఖ తీరాన బాబు సైకిల్ సవారీ !
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో సైకిల్ సవారీ చేయనున్నారు. విశాఖ తీరాన బాబు సైకిల్ తొక్కుతూ జనానికి పర్యావరణ సందేశం ఇవ్వనున్నారు.
By: Satya P | 4 Jun 2026 9:02 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో సైకిల్ సవారీ చేయనున్నారు. విశాఖ తీరాన బాబు సైకిల్ తొక్కుతూ జనానికి పర్యావరణ సందేశం ఇవ్వనున్నారు. ఈ నెల 5న శుక్రవారం బాబు విశాఖలో జరిగే అధికారిక కార్యక్రమాలలో పాలు పంచుకోనున్నారు. ఇదే సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాబు సైకిల్ సవారీ ద్వారా జరిగే మేలు పర్యావరణానికి సమకూరే ప్రయోజనాల గురించి సోదాహరణంగా ఆచరణాత్మకంగా వివరించే ప్రయత్నం చేయనున్నారు.
అందరూ కలసి రావాలి :
ఇదిలా ఉంటే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనమందరం సైకిళ్లు, ఈ-సైకిళ్లపై ప్రయాణిస్తూ ఒక్కొక్క మొక్కను నాటుదాం అని బాబు పిలుపు ఇచ్చారు. తన విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రజలలో పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తాను సైకిల్పై ప్రయాణిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరూ మద్దతు తెలిపి దీనిని విజయవంతం చేయడంలో మాతో పాలుపంచుకోవాలని తాను అభ్యర్థిస్తున్నానని బాబు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ :
ఇదిలా ఉండగా పర్యావరణ పరి రక్షణకు ప్రతీ ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి తలో ఒక మొక్క నాటాలని ప్రజలకు బాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ సుస్థిర జీవనం అనే సందేశాన్ని బలోపేతం చేస్తూ చంద్రబాబు నాయుడు స్వయంగా విశాఖపట్నంలో సైకిల్ యాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా సందర్భంగా పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించడం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి స్థానికంగా జరిగే ఒక జాతీయ వర్క్షాప్ కార్యక్రమ వేదికకు నేరుగా సైకిల్పై చేరుకుంటారు.
ప్రకృతి జీవనాధారం :
ఈ నేపధ్యంలో బాబు ప్రజలకు సామాజిక మాధ్యమం ద్వరా పంపిన ఒక సందేశంలో పు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనమందరం సామూహిక ప్రతిజ్ఞ చేద్దామని కోరారు. భూమి మన ఇల్లు అని , ప్రకృతి మన జీవనాధారం అని పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి సమిష్టి బాధ్యత అని బాబు చెప్పారు. అందువల్ల సహజ వనరులను పరిరక్షిద్దామని గాలి నీరు నేల కాలుష్యాన్ని నివారించడానికి కలిసికట్టుగా కృషి చేద్దామని ఆయన కోరారు. అదే విధంగా సుస్థిర భవిష్యత్తు కోసం పచ్చదనాన్ని ప్రోత్సహించడం ఇంధన వనరులను తెలివిగా ఉపయోగించడం చాలా అవసరం మని బాబు తన సందేశంలో పేర్కొన్నారు.
