సీఆర్ డీఏకు పూర్తి స్వేచ్ఛ!
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా రాజధాని అమరావతి పనులపై సమీక్షించారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను ఆయన సమీక్షించారు.
By: Tupaki Desk | 19 May 2025 9:50 AMఏపీ సీఎం చంద్రబాబు తాజాగా రాజధాని అమరావతి పనులపై సమీక్షించారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను ఆయన సమీక్షించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రాజధాని అమరావతి పనులను పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిరంతరాయంగా సీడ్ యాక్సిస్ రోడ్డు సహా.. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తుల భవనాల నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీటిపైనే తాజాగా సీఎం చంద్రబాబు సమీక్షించారు.
ఇదేసమయంలో రాజధానిని విస్తరించే అంశాలపైనా ఆయన చర్చించారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్ డీఏ) అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం.. ఈ సంస్థకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్టు తెలిపారు. మరింత ఎక్కువగా పనులు చేసేందుకు.. త్వరగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని.. పనుల్లో ఆలస్యం.. అలసత్వాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదన్నారు. అందుకే.. పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నట్టు తెలిపారు.
రాజధానికి గతంలో 33 వేల ఎకరాల వరకు రైతులు సేకరణ(పూలింగ్) కింద భూములు ఇచ్చారు. అయితే.. విమానాశ్రయం సహా.. ఇతర ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఇక్కడ నెలకొల్పేందుకు మరిన్ని ఎకరాల భూమి అవసరమైన విషయం తెలిసిందే. దీనిపైనా తాజాగా చంద్రబాబు సమీక్షించారు. భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహించాలని సూ చించారు. ఏదైనా సందేహాలతో ఉండి.. వెనుకాడుతున్న వారికి వివరించి.. వారిని ఒప్పించి తీసుకోవాల న్నారు.
అదేసమయంలో విపక్ష వైసీపీ నాయకులు చేసే వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు సూచించారు. ``రాజధాని పనులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. వాటిపై ఇప్పుడే విష ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారం చేస్తున్న షాడో మనుషులపై కూడా కేసులు పెట్టాలి. ఆ దిశగా పోలీసులకు పిర్యాదు చేయండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను`` అని సీఆర్ డీఏ అధికారులకు సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్తితిలోనూ వచ్చే మూడేళ్లలోపే రాజధాని పనులు పూర్తి కావాలని మరో సారి ఆయన స్పష్టం చేశారు.