హెచ్ సీయూ ఇష్యూలో స్పందించే సెలబ్రిటీలు ఇప్పుడే నిద్ర లేచారా?
నాలుగైదు రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు.. వర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 April 2025 4:59 AMనాలుగైదు రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు.. వర్సిటీ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా సినీ ప్రముఖులు.. సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు చొప్పున స్పందిస్తున్న తీరు.. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో ఎన్నో ఉద్యమాలు.. నిరసనలు జరిగినా పట్టని ప్రముఖులకు హెచ్ సీయూ అంశం అంతలా ఆకట్టుకోవటానికి కారణం ఏమిటి? అధికార పక్షానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు ఎందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
సామాజిక స్ప్రహతో స్పందించటం తప్పేం కాదు. నిజానికి ఇలాంటి చైతన్యం సినీ ప్రముఖులకు.. ప్రముఖులకు.. సెలబ్రిటీలకు ఉంటే మంచిదే. పౌరులు సైతం మరింత చైతన్యంతో ఉంటారు. కాకుంటే... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో సెలబ్రిటీల స్పందన వెనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ పోస్టులతో ప్రభావితం కావటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఒక అంశం మీద ప్రముఖులు స్పందించే సమయంలో ఆ అంశంపై పూర్తి అవగాహనతో పాటు.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పలు పరిణామాల్ని సైతం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీకి చెందిన 400 ఎకరాలు అన్నది అసలేమాత్రం సరికాదు. ఎందుకంటే.. ఈ భూమిని ఎప్పుడో వేరే వారికి బదిలీ చేయటం.. దానిపై యాజమాన్య హక్కుల్ని రాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకోవటం ఎప్పుడో జరిగిపోయింది. ఇక.. జీవవైవిధ్యం.. ఆక్సిజన్ బ్యాంక్.. లంగ్ స్పేస్ అన్న మాటలు.. వాటికి తగ్గట్లు చూసినంతనే కదిలిపోయేలా ఫోటోలు.. వీడియోలు విడుదల కావటం.. అవి కాస్తా వైరల్ కావటం కూడా ఈ స్పందనలో భాగంగా చెప్పాలి.
హెచ్ సీయూకి చెందినట్లుగా చెబుతున్న 400 ఎకరాల్ని చదును చేయటాన్ని వ్యతిరేకిస్తూ.. మూగజీవాలు జేసీబీల ఎదుట ఆందోళనగా పరుగులు తీయటం.. రాత్రి వేళలో పనులు జరుగుతున్న సమయంలో నెమెళ్ల ఏడుపులతో కూడిన వీడియో మొదలు.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పలు ఫోటోలు ఫేక్ కావటాన్నిమర్చిపోకూడదు. ఏఐ సాంకేతికతో తయారు చేసిన వీటిని ఒక క్రమపద్దతిలో సోషల్ మీడియాలో వైరల్అయ్యేలా చేస్తున్న పరిస్థితి. అయితే.. ఈ అంశాల్ని పట్టించుకోని సెలబ్రిటీలు.. వైరల్ అవుతున్న పోస్టులకు తమ స్పందనను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. ప్రభుత్వం చదును చేస్తున్న 400 ఎకరాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? అక్కడ వందల ఏళ్ల నాటి చెట్లు.. లేదంటే పదుల ఏళ్ల వయసున్న చెట్లు ఉన్నాయా? అన్న అంశం మీదనైనా కనీస అవగాహన ఉందా? మరో కీలకమైన అంశం ఏమంటే.. ఇప్పటికి హెచ్ సీయూ పరిధిలో ఉన్న వందల ఎకరాల్లో గడిచిన పాతికేళ్లలో పచ్చదనం పెరిగిందా? తగ్గిందా? అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారా? అటవీ ప్రాంతం అని అంటున్న వారు..నిజంగానే అక్కడ అడవి అన్నంతనే ఉండే వాతావరణం ఉందా? లేదా? అన్న ప్రశ్న ఎందుకు వేసుకోవటం లేదు?అన్నది ప్రశ్న.
ఇక్కడ సమస్య ఏమంటే.. ఎవరో ఏదో చెప్పిన విషయాన్ని పట్టుకొని వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడటం సెలబ్రిటీలకు అస్సలు మంచిది కాదు. ప్రముఖుల్లో భావోద్వేగాన్ని స్వాగతించాల్సిందే. కానీ.. రాజకీయ ఉచ్చులో పడకూడదు కదా? ఒక క్రమపద్దతిలో సాగుతున్న తప్పుడు ప్రచారానికి ప్రభావితం కావటం ఎంతవరకు సబబు? ఇక్కడే మరో అంశాన్ని కూడా ప్రస్తావించాలి. ఈ మొత్తం ఎపిసోడ్ లో రేవంత్ ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టాలి. తప్పుడు ప్రచారానికి విరుగుడుగా.. వాస్తవాలను ప్రజలకు మరింత తెలిసేలా వివరాల్ని..వీడియోల్ని వెల్లడించాల్సింది. ఆ విషయంలో వారి నిర్లక్ష్యం.. ప్రముఖులు సైతం తప్పుడు ప్రచార ప్రభావానికి గురి కావటమే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పక తప్పదు.