Begin typing your search above and press return to search.

80 రోజుల తరువాత జనంలోకి చంద్రబాబు

చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇన్నాళ్ళు ప్రజలతో మమేకం కాకుండా ఉండలేదు. ప్రత్యేకించి ఆయన 1995లో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి జనంలోకి వస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 2:27 PM GMT
80 రోజుల తరువాత జనంలోకి చంద్రబాబు
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 29 నుంచి ప్రజలలోకి వెళ్లవచ్చు అంటూ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దాంతో తెలుగుదేశం పార్టీకి బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయింది. చంద్రబాబు దాదాపుగా ఎనభై రోజుల తరువాత జనంలోకి వస్తున్నరు. సెప్టెంబర్ 9న చంద్రబాబు నంద్యాలలో అరెస్ట్ అయ్యారు. ఆ మరుసటి రోజు అర్ధరాత్రి ఆయన రాజమండ్రి జైలుకు రిమాండ్ మీద తరలించబడ్డారు.

ఇదిలా ఉంటే చంద్రబాబుకు గత నెల 31న మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. తాజాగా బాబుకు పూర్తి బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 29 నుంచి ఆయన ప్రజలలోకి వెళ్లవచ్చు అని కూడా స్పష్టం చేయడంతో బాబు మీద ఉన్న రాజకీయ ఆంక్షలు అన్నీ పూర్తిగా తొలగిపోయాయి.

దాంతో బాబు ఇక మీదట జనంలోకి రానున్నారు అన్న మాట. బాబు జనంలోకి వస్తే ఏమి మాట్లాడుతారు అన్నది ఇపుడు అతి పెద్ద చర్చ. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇన్నాళ్ళు ప్రజలతో మమేకం కాకుండా ఉండలేదు. ప్రత్యేకించి ఆయన 1995లో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి జనంలోకి వస్తూనే ఉన్నారు. అంటే 28 ఏళ్ల పాటు బాబు జనంతో పెట్టుకున్న కనెక్షన్ ని ఈ జైలు జీవితం బెయిల్ జీవితం పూర్తిగా బ్రేక్ చేశాయని చెప్పాలి.

ఇక చంద్రబాబు జనంలోకి వస్తే ఏమి చెబుతారు అన్నది కూడా అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న అంశం. చంద్రబాబు తనను అన్యాయంగా జైలులో పెట్టారని జనం మధ్యకు వచ్చి చెబుతారు అని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకులతో పాటు చంద్రబాబు కుమారుడు లోకేష్, సతీమణి భూవనేశ్వరి కోడలు బ్రాహ్మణి అదే మాటను చెబుతూ జనంలోకి వెళ్లారు.

ఇక వైసీపీ ప్రభుత్వ బాధితుడిని తాను అంటూ చంద్రబాబు జనంలోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు. అంతే కాదు తనను జైలులో పెట్టిన ఇబ్బందులు కూడా ఆయన చెబుతారు అని అంటున్నారు. ఒక విధంగా బాబు ఇన్నాళ్ళు ప్రజలకు కంపించకుండా ఉండడంతో ఆయన మీద ఒక రకమైన ఆసక్తి అయితే జనంలో ఉంటుంది.

అదే విధంగా బాబు జైలులో ఈ వయసులో ఉన్నారు అంటే వచ్చే సానుభూతి మీద కూడా టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా తనదైన శైలిలో జనాల్లోకి వస్తారని అంటున్నారు. చంద్రబాబు పర్యటన అన్నది ఎపుడు ఉంటుంది అన్నది కూడా ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఈ నెల 30న ఆయనను ఏసీబీ కోర్టు ముందు హాజరు కావాలని కోరింది.

దాంతో చంద్రబాబు ఈ నెల 30న విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు కానున్నారు. అదే టైం లో అదే రోజున తెలంగాణా ఎన్నికలు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. దాంతో తెలంగాణాలో రాజకీయాలను అక్కడ మార్పుచేర్పులను కూడా చూసుకున్న మీదటనే చంద్రబాబు మంచి ముహూర్తం చూసుకుని ఏపీలో పర్యటన చేస్తారని అంటున్నారు.

అది కూడా తనను అరెస్ట్ చేసిన నంద్యాల నుంచే ఉండవచ్చు అని అంటున్నారు. ఇక చంద్రబాబు ఏపీలో అడుగుపెట్టడం ఆయన తొలి సభ అదిరిపోయేలా చేయడానికి టీడీపీ సన్నాహాలు చేస్తోంది అని అంటున్నారు. సరిగ్గా ఏపీ ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు బయటకు రావడం జైలు బెయిల్ సెంటిమెంట్ ని కూడా టీడీపీ పూర్తిగా నమ్ముకోవడంతో ఏపీ రాజకీయాలు ఏ విధంగా ముందుకు సాగుతాయో చూడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే చంద్రబాబుకు బెయిల్ మాత్రమే లభించిందని ఆయన నిర్దోషి అని కోర్టు తేల్చలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అంటున్నారు. బాబు బెయిల్ విషయం జనంలో పెట్టి సానుభూతి పొందే ప్రయత్నం టీడీపీ చేస్తోంది అని ఆయన విమర్శించారు. ఏది ఏమైనా రాజకీయంగా టీడీపీకి ఇపుడు చంద్రబాబు బెయిల్ రావడం అన్నది కొండంత బలం అనే అంటుననరు. మరి బాబు ఏ విధంగా రీ ఎంట్రీ ఇస్తారో చూడాల్సిందే.