Begin typing your search above and press return to search.

ఒడిశా రైలు దుర్ఘటన.. కీలక విషయాలు వెల్లడించిన సీబీఐ!

అరుణ్‌ కుమార్‌ మహంత.. ఉన్నతాధికారుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించారని సీబీఐ తెలిపింది.

By:  Tupaki Desk   |   26 Aug 2023 5:04 AM GMT
ఒడిశా రైలు దుర్ఘటన.. కీలక విషయాలు వెల్లడించిన సీబీఐ!
X

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటన సంగతి తెలిసిందే. ఈ ఘోర రైలు ప్రమాదంలో 296 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా క్షతగాత్రులయ్యారు. దీంతో ఈ ప్రమాదంపై సీబీఐ ఎంక్వైరీ వేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో తాజాగా సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటన జరగడానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కీలక విషయాలు వెల్లడించింది. పట్టాలపై అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణం అని వెల్లడించింది.

అవును... సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌ ఇన్‌ ఛార్జి) అరుణ్‌ కుమార్‌ మహంత.. ఉన్నతాధికారుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించారని సీబీఐ తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానానికి సీబీఐ ఈ విషయాలు సవివరంగా వివరించింది.

ఇందులో భాగంగా.. బహానగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ క్రాసింగ్‌ లెవెల్‌ గేట్‌ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షంలోనే జరిగాయని కోర్టుకు వివరించింది. దీనికోసం ఆయన సీనియర్‌ డివిజినల్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌ అండ్‌ టెలికం) నుంచి అనుమతులు గానీ, సర్క్యూట్‌ గ్రాఫ్ గానీ తీసుకోలేదని తెలిపింది.

ఇదే సమయంలో... పనులు జరుగుతున్నప్పుడు మహంత అక్కడే ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలోనే మరమ్మతులు చేపట్టారని, గేట్‌ నెంబరు 79 వద్ద మరమ్మతులకు ఉపయోగించిన సర్క్యూట్‌ చిత్రం ఆధారంగానే ఇక్కడ మరమ్మతులు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించింది.

ఈ రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐ అరెస్టు చేసిన ముగ్గురిలో ఒకరైన అరుణ్‌ కుమార్‌ మహంత.. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ భువనేశ్వర్‌ లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. అయితే దీనిని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయొద్దని కోరింది.

కాగా... జూన్‌ 2న ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలో బహానగా బజార్‌ స్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 296 మంది ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా క్షతగాత్రులైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై విచారణ సందర్భంగా... కేంద్రం సిఫారసు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ ముగ్గురిని అరెస్టు చేసింది.

అరెస్టయిన వారిలో సెక్షన్‌ ఇంజినీర్‌ (సిగ్నల్‌ ఇన్ చార్జ్) అరుణ్‌ కుమార్‌ మహంత, సెక్షన్‌ ఇంజినీర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ ఖాన్‌, టెక్నిషియన్‌ పప్పు కుమార్‌ లు ఉన్నారు.