Begin typing your search above and press return to search.

క‌విత కేసులో సీబీఐ ఎంట్రీ.. విచారించ‌నున్న అధికారులు!

ఇప్పుడు జైల్లో ఉన్న కవితను ప్రశ్నిస్తామంటూ సీబీఐ రంగంలోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   5 April 2024 1:13 PM GMT
క‌విత కేసులో సీబీఐ ఎంట్రీ.. విచారించ‌నున్న అధికారులు!
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట‌యిన బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ కవితను ఇప్ప‌టికే ఈడీ విచారించిన విష‌యం తెలిసిందే. ఆమె ఈ కేసులో ఖ‌త‌ర్నాక్ అని కూడా పేర్కొంది. రూ.100 కోట్ల‌ను బ‌దిలీ చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని కూడా పేర్కొంది. మనీ లాండరింగ్ చేశారంటూ ఈడీ అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఇప్పుడు జైల్లో ఉన్న కవితను ప్రశ్నిస్తామంటూ సీబీఐ రంగంలోకి వచ్చింది. తమకు అనుమతి కావాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది.

ఇంటరాగేట్ చేయడానికి లేదా స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి అనుమతి కావాలని సీబీఐ ఆ పిటిషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. తీహార్ జైల్లోనే కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అవినీతిపై సీబీఐ కేసు, మనీలాండరింగ్ పై ఈడీ కేసులు నమోదయ్యాయి. సీబీఐ గతంలో కవిత ఇంటికి వచ్చి స్టేట్ మెంట్ రికార్డు చేసుకుంది. సుదీర్ఘ‌ విరామం తర్వాత మళ్లీ ఫిబ్రవరి 22న సీబీఐ కవితకు సీబీఐ జారీ చేసింది. ఫిబ్రవరి 26 న తమ ఎదుట హాజరుకావాలని ఫ్రెష్ గా సమన్లు పంపింది. కానీ కవిత తాను బిజీగా ఉన్నానని.. తన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ లో ఉందన్న కారణాలతో హాజరు కాలేదు.

2022 జులై తర్వాత లిక్కర్ స్కాం వెలుగులోకి రాగా.. దాదాపు ఐదు నెలల తర్వాత అదే ఏడాది డిసెంబర్ లో తొలిసారి సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది. 2022, డిసెంబర్ 11న తొలిసారి సీబీఐ కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో విచారించింది. సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షిగా సుమారు ఏడు గంటలకు పైగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తర్వాత సీఆర్పీసీ 91 కింద ఈ కేసుకు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత సీబీఐ నోటీసులు ఇచ్చినా కవిత హాజరు కాలేదు. కోర్టులో ఉన్న తన పిటిషన్‌ను కారణంగా చూపించారు.

అయితే సీబీఐ అరెస్టు చేయలేదు. ఈడీ అరెస్టు చేయడంతో పాటు.. జైల్లో ఉండటంతో ప్రశ్నించేందుకు అనుమతి కోసం.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అరెస్టు చేయక ముందే ఆమె ఢిల్లీలో పలమార్లు విచారణకు హాజర‌య్యారు. మూడు సార్లు.. 28 గంటల పాటు విచారణకు హాజరైన కవిత నుంచి ఈడీ కే స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం, సౌత్ గ్రూపు ఏర్పా టు, సౌత్ గ్రూప్- ఆప్ మధ్య జరిగిన వ్యవహారాలు, ఒప్పందాలు, సౌత్ గ్రూపులో కవిత పాత్ర, పెట్టిన పెట్టుబడులు, ముడుపులు గా ఇచ్చిన డబ్బులు, స్కాంలో భాగస్వాములైన నిందితులతో జరిపిన సమావేశాల గురించి సుదీర్ఘంగా ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలపై కవిత ఇచ్చిన సమాధానాలతో రూపొందించిన పత్రాలపై సంతకాలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడూ నోటీసులు జారీ చేయలేదు. నేరుగా సోదాలకు వచ్చి అరెస్టు చేసింది. కవిత తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంత బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ పూర్తి అయింది. తీర్పు రిజర్వ్ చేశారు. ఈ లోపే సీబీఐ.. తము కవితను ప్రశ్నించాల్సి ఉందని పిటిషన్ వేయడంతో బెయిల్ పిటిషన్ పై తీర్పు అనుకూలంగా వస్తుందని చెప్పలేమని కవిత వర్గీయులు అంటున్నారు.