Begin typing your search above and press return to search.

అక్కినేని నాగార్జున సోద‌రిపై కేసు న‌మోదు... వివాదం ఏంటంటే!

అక్కినేని నాగ సుశీల వార్తల్లోకి ఎక్కారు. ఆమెకు బిజినెస్ పార్ట‌న‌ర్‌గా ఉన్న చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు అనే వ్య‌క్తి ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు.

By:  Tupaki Desk   |   18 Sep 2023 3:05 PM GMT
అక్కినేని నాగార్జున సోద‌రిపై కేసు న‌మోదు... వివాదం ఏంటంటే!
X

అక్కినేని నాగార్జున. ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఇప్పుడు ఆయ‌న సోద‌రి.. అక్కినేని నాగ సుశీల వార్తల్లోకి ఎక్కారు. ఆమెకు బిజినెస్ పార్ట‌న‌ర్‌గా ఉన్న చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు అనే వ్య‌క్తి ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆమెతోపాటు.. మ‌రో 12 మందిపైనా ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం.

ఏంటి వివాదం?

చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు చెబుతున్న క‌థ‌నం మేర‌కు.. అక్కినేని నాగ సుశీల స‌హా .. మ‌రో 12 మంది ఆయ‌న‌పై భౌతిక దాడి చేశారు. ఓ భూ వివాదంలో బౌన్స‌ర్ల‌ను పెట్టి సుశీల త‌న‌ను కొట్టించార‌ని చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు టీవైఆర్ మొయినాబాద్ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని ప‌రిశీలించిన పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇటీవ‌ల శ్రీనివాస‌రావు ఓ ట్ర‌స్టుకు కొంత భూమిని దానంగా ఇచ్చారు. అయితే.. ఈ భూమి త‌న‌ద‌ని.. నాగ సుశీల పేర్కొంటున్నారు. క‌నీసం త‌న‌కు చెప్ప‌కుండానే భూమిని దానం చేయ‌డం ఏంట‌నేది ఆమె వాద‌న‌. ఈ క్ర‌మంలోనే బౌన్స‌ర్ల‌తో త‌న‌పై దాడి చేయించార‌నేది చింత‌ల‌పూడి వాద‌న‌.

ఎవ‌రీ శ్రీనివాస‌రావు.. ఏంటి విష‌యం..

చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు-అక్కినేని నాగ సుశీల‌ల మ‌ధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇరువురు కూడా వ్యాపార భాగ‌స్వాముల‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అక్కినేని నాగ సుశీల కుమారుడు, నాగార్జున మేన‌ల్లుడు అక్కినేని సుశాంత్ న‌టించిన నాలుగు సినిమాల‌కు(క‌రెంట్‌-కాళిదాసు-అడ్డా-ఆటాడుకుందాం రా) ఇరువురు పెట్టుబ‌డులు కూడా పెట్టారు. అయితే, భూమి విష‌యంలో శ్రీనివాస‌రావుకు, నాగ సుశీల‌కు మ‌ధ్య వివాదాలు త‌లెత్తాయి.

ఈ విష‌యంలో ఇరువురి మ‌ధ్య సుదీర్ఘ వివాదం కొన‌సాగుతోంది. ఇటీవ‌ల శ్రీనివాస‌రావుపై సుశీల కూడా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌కు చెందిన భూమిని త‌న అనుమ‌తి లేకుండానే శ్రీనివాస‌రావు విక్ర‌యించార‌ని అక్కినేని సుశీల ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.