Begin typing your search above and press return to search.

కెనడా...భారత్ ల మధ్య అలా మొదలైంది వివాదం

అయితే గత కొంతకాలంగా ఆవి నెమ్మదిగా క్షీణిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది మధ్యలో ఖలీస్థాన్ ప్రబోధకుడు అమృత్ పాల్ సింగ్ మీద భారత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 2:30 AM GMT
కెనడా...భారత్ ల మధ్య అలా మొదలైంది వివాదం
X

కెనడా నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న దేశం. భారత్ 143 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలో ఈ రొజు అతి పెద్ద దేశం. కెనాడా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో తొమ్మిదవ స్థానంలో ఉంది. భారత్ అయిదవ స్థానంలో ఉంది. మూడవ స్థానానికి ఏగబాకనుంది. రెండూ కూడా అభివృద్ధిలో ధీటైన దేశాలే. భారత్ కెనడాల మధ్య ఎగుమతులు దిగుమతులు జరుగుతూ వస్తూ ఉంటాయి.

రెండు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ఆవి నెమ్మదిగా క్షీణిస్తూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది మధ్యలో ఖలీస్థాన్ ప్రబోధకుడు అమృత్ పాల్ సింగ్ మీద భారత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి వ్యతిరేకంగా కెనడాలో భారత దౌత్య కార్యాలయాన్ని టార్గెట్ గా చేసుకుని అక్కడ ఖలీస్థాన్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు.

అపుడు మొదటిసారిగా భారత్ రియాక్ట్ అయింది. కెనడాలో భారత దౌత్య కార్యాలయం భద్రత చూడాలని కెనడాను కోరింది. దీని తరువాత కెనాడాలో బ్రాంప్టన్ లో ఇందిరాగాంధీ హత్యను చిత్రీకరిస్తూ ఖలిస్థాన్ మద్దతుదారులు ఆందోళనలు నిర్వహించారు. దీని మీద అయితే కెనడా ప్రభుత్వం మీదనే భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్ గట్టిగానే మండిపడ్డారు.

ఇలాంటి చర్యలు ఇండియా కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని కూడా హెచ్చరించారు. ఇంతలో ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురి అయ్యాడు. ఆయన బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారాలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

దీంతో ఈ కేసు మీద కెనడా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేసించింది. నిజ్జర్ హత్యకు కెనడాలోని భారత్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, కౌన్సిల్ జనరల్ అపూర్వ శ్రీ వాస్తవలే కారణం అని ఖలిస్థాన్ మద్దతుదారులు ఆరోపించారు. ఇలా భారత్ మీద భారత దౌత్య అధికారుల మీద నేరుగా వారు ఆరోపణలు చేయడం వివాదం అయింది. అంతే కాదు టొరొంటోలో జూలై 8న దీని మీద భారీ ర్యాలీ నిర్వహించి మరీ కరపత్రాలను పంపిణీ చేశారు.

దీన్ని భారత్ మరింత సీరియస్ గా తీసుకుంది. ఇంతలో జీ 20 సమ్మిట్ న్యూ ఢిల్లీలో జరిగింది. దానికి కెనడా ప్రధాని ట్రుడ్రో హాజరయ్యారు. కానీ ఆయన భారత్ మీద మనసులో పెట్టుకునే ఈ మీటింగ్ కి వచ్చారు అని అంటున్నారు. ఆయనకు హై లెవెల్ సెక్యూరిటీతో ఢిల్లీలో సూట్ ని కేటాయిస్తే సాధారణ గదిలోకి మారి మూడు రోజులూ అక్కడే గడిపారు అని తెలిసింది.

ఇక ఆయన వచ్చిన విమానానికి సాంకేతిక లోపం తలెత్తితే భారత్ మర్యాదగా తాము విమాన సౌకర్యం కల్పిస్తామని చెప్పినా నో చెప్పి మరీ మూడు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. చివరికి తన విమానంలోనే ఆయన కెనడా పయనం అయ్యారు. దీని కంటే ముందు జీ 20లో కెనడా ఉగ్రవాదులకు ఆవాసంగా మారుతోంది అని ప్రధాని నరేంద్ర మోడీ సదస్సు దృష్టికి తెచ్చారు.

అంతే కాదు ఖలిస్థాన్ ఉగ్రవాదాన్ని అణచడంతో పాటు మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణ వంటి వాటిని అరికట్టడంతో పరస్పరం సహకరించుకోవాలని కెనడాకు భారత్ సూచించింది. అయితే కెనడా ప్రధాని మాత్రం తమ దేశంలో భావ ప్రకటనకు గౌరవం ఎక్కువ అన్నట్లుగా మాట్లాడారు. శాంతియుతంగా జరిగే అందోళనలకు అవకాశమిస్తామని కూడా చెప్పడం విశేషం.

అల్లర్లను సహించబోమంటూనే ఎవరో కొందరు చేసే అల్లర్లను గొడవలను మొత్తం వర్గానికి ఆపాదించడం తగదని తెగేసి చెప్పిన తీరుతో కెనడా కడుపులో అక్కసు ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది అంటున్నారు. ఇక జీ 20 సదస్సు నుంచి తన దేశానికి వెళ్ళిన కెనడా ప్రధాని అక్కడ పార్లమెంట్ లో మాట్లాడుతూ నిజ్జర్ హత్యకు భారత్ హస్తం ఉందని వివాదాస్పద కామెంట్స్ చేసి అగ్గి రాజేశారు. తమ పౌరుల పట్ల విదేశీ పెత్తనాన్ని సహించేది లేదని కూడా ఘాటైన కామెంట్స్ చేశారు.

ఇలా కనుక చూసుకుంటే అమృత్ పాల్ తో మొదలైన వివాదాం కాస్తా జీ 20 సదస్సులో బాహాటం అయింది. మరో వైపు చూస్తే పూర్తిగా రాజకీయ కారణాలతో ట్రుడ్రో భారత్ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. ట్రుడ్రో మీద ప్రజలలో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని, ఆయన ఈసారి ఖలిస్తాన్ మద్దతు గ్రూపుల వర్గాల మద్దతుతో మళ్లీ గెలవాలనే వారికి అండగా ఉంటూ మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా భారత్ కి ఇపుడు కెనడాతో కొత్త వైరం పుట్టుకొచ్చింది అనుకోవాలేమో.