Begin typing your search above and press return to search.

కవితతో కేసీఆర్ రాజీ.. రాయబారం?

బీఆర్ఎస్ లో పరిణామాలు ఆసక్తి రేపుతోంది. వైఎస్ జగన్ కు చెల్లి షర్మిల క్రమక్రమంగా దూరమైంది.

By:  Tupaki Desk   |   27 May 2025 11:17 AM IST
కవితతో కేసీఆర్ రాజీ.. రాయబారం?
X

బీఆర్ఎస్ లో పరిణామాలు ఆసక్తి రేపుతోంది. వైఎస్ జగన్ కు చెల్లి షర్మిల క్రమక్రమంగా దూరమైంది.వారి మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ లోనూ అదే పునరావృతం కాగా.. కేసీఆర్ అలెర్ట్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కూతురు కవిత అసంతృప్తిని చల్లార్చే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. కుమారుడు కేటీఆర్ కూడా సంధి చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కవితకు రాయబారం కేసీఆర్ పంపారని.. ఆమెను శాంతింపచేసే పని పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ లో పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి.

బీఆర్ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి సూచ‌న‌లు చేస్తూ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ లేఖపై కేసీఆర్ ఎవరూ స్పందించవద్దని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో అప్పటి నుంచి ఈ లేఖ వ్యవహారంపై ఎవరూ బహిరంగంగా స్పందించడం లేదు.

కవిత లేఖ బయటపడి మూడు రోజులు గడిచినా, ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు, పిలుపులు లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో మరింత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 6-7 గంటల సమయంలో కవిత నివాసానికి తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత దీవకొండ దామోదర్‌రావు వచ్చారు. ఆయన వెంట సీనియర్ న్యాయవాది కూడా ఉండటం గమనార్హం.

దీనిని బట్టి కేసీఆరే దామోదర్‌రావును, న్యాయవాదిని కవిత వద్దకు పంపించారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌తో సుదీర్ఘ అనుబంధం ఉన్న దామోదర్‌రావు పార్టీ పరంగానే కాకుండా, 'నమస్తే తెలంగాణ' పత్రిక పరంగా కూడా చేరువ. ఈ పత్రికను ఆయన కనుసన్నల్లోనే స్థాపించారు. ఆ తర్వాత కేసీఆర్ ఆశీస్సులతోనే 2022లో రాజ్యసభలో అడుగుపెట్టారు. దీంతో ఆయన్ను 'కేసీఆర్ ఆత్మగా' సొంత మీడియాలో పిలుస్తారు.

కేసీఆర్‌కు సన్నిహితుడుగా, ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్న దామోదర్‌రావు ఇప్పుడు కవితను కలుసుకునేందుకు రావటం ఆశ్చర్యంగాను, ఆసక్తిగాను మారింది. ఈయన వెంట న్యాయవాది కూడా ఉండటంతో ఏదో తేల్చుకునే పనిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరి చివరకు రాజీ ధోరణికి వస్తారా? లేక ఏం జరుగుతుందన్నది మాత్రం ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.