చంద్రబాబుపై ఒత్తిడి పెంచిన బొత్స.. విషయం ఏంటంటే!
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 4 April 2026 11:36 PM ISTఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన కలల రాజధాని అని చెబుతున్న అమరావతిని సత్వరమే పూర్తి చేయాలని.. అలా కాకుం టే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. `వేరే ఆలోచన` చేస్తామని చెప్పారు. అంతేకాదు.. తమకు అమరావతి కేవలం.. శాసన రాజధాని మాత్రమేనన్నారు. దానికి తాము `ప్రాధాన్యం` ఇచ్చేది లేదని చెప్పారు.
అమరావతి రాజధానికి వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న బొత్స సత్యనారాయణ.. అక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలు, మనీలాండరింగ్ వాటికి మాత్రమే తాము వ్యతిరేకమని చెప్పారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో `అమరావతి` కూడా ఉందన్నారు. దీనిని తాము శాసన రాజధానిగా గుర్తించామని.. ఆమేరకు అభివృద్ధి చేయాల ని భావించామని చెప్పారు. అందుకే తాము లక్షల కోట్ల రూపాయలను ఒక్క అమరావతిలోనే ఖర్చు చేసేందుకు ముందుకు రాలేదని తెలిపారు.
ఇప్పటికైనా చంద్రబాబు పూర్తిస్థాయి రాజధానిగా అమరావతిని కోరుకుంటే.. తక్షణమే ఆయన రాజధానిని పూర్తి చేయాలని సూచించారు. లేకపోతే.. తాము మరో ఆలోచన చేస్తే తప్పులేదన్నారు. ``మా విధానం మాది. చంద్రబాబు విధానం చంద్రబాబు ది. ఆయన నిర్ణయం కరెక్టని మీరు(మీడియా) భావిస్తే.. మా విధానం కరెక్టేనని మరి(మీడియా) కొందరు భావిస్తారు. దీనిలో ఎవరి వాదన వారికి కరెక్ట్గా ఉంటుంది. ఎవరైనా ప్రజల కోసమే పనిచేస్తారు. మేం మా కోసంపనిచేశామని మీరు అంటే.. మీరు కూడా మీకోసం పనిచేస్తున్నారని మేం చెబుతాం.`` అని వ్యాఖ్యానించారు.
బాబుపై ఒత్తిడి కోసమే!
ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మరో మూడు సంవత్సరాలు మాత్రమే గడువు ఉంటుంది. దీనిలో చివరి ఆరు మాసాలు ఎలానూ ఎన్నికల హంగామాతో ప్రభుత్వానికి సమయం సరిపోదు. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్లు మాత్రమే ఉంటుంది. దీనిలోనూ వర్షాలు.. తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలకు మరో 7-8 మాసాలు పోగా.. గరిష్టంగా ప్రభుత్వానికి రెండేళ్లకు మించి సమయం దొరకదు. ఈ రెండేళ్లలోనే అమరావతిని పూర్తిచేయాలన్న.. షరతు ద్వారా సర్కారుపైనా ముఖ్యంగా చంద్రబాబుపైనా వైసీపీ వ్యూహాత్మక ఒత్తిడి పెంచుతోంది.
