Begin typing your search above and press return to search.

గుసగుస : వైసీపీలో ఆ ఇద్దరిదే హవా ?

ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో ఆ ఇద్దరు నాయకులదే హవాగా కనిపిస్తోంది. ఎన్నో పదవులు ఎందరో నేతలూ ఉన్నప్పటికీ వారిదే పెత్తనంగా ఉంది

By:  Tupaki Desk   |   8 May 2025 3:36 AM
గుసగుస : వైసీపీలో ఆ ఇద్దరిదే హవా ?
X

ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో ఆ ఇద్దరు నాయకులదే హవాగా కనిపిస్తోంది. ఎన్నో పదవులు ఎందరో నేతలూ ఉన్నప్పటికీ వారిదే పెత్తనంగా ఉంది అని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు అత్యంత సీనియర్ నేత అయిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే రెండవ వారు యువ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్.

ఈ ఇద్దరూ విశాఖ జిల్లా వైసీపీలో తమ పలుకుబడిని చాటుకుంటున్నారు వేరే వారు పదవులలో ఉన్నా వీరే ముందుండి అంతా నడిపిస్తున్నారు. ముందుగా బొత్స గురించి చెప్పుకుంటే ఆయన విజయనగరం జిల్లాకు చెందిన వారు. అయితే ఆయన పీసీసీ చీఫ్ గా పనిచేసిన వ్యక్తి. దాంతో పాటుగా ఉత్తరాంధ్రా అంతటా ఉన్న రాజకీయ పరిచయాలతో ఆయన మొత్తం ఈ రీజియన్ లో తన పలుకుబడిని చూపిస్తూ వస్తున్నారు.

దానికి తోడు అన్నట్లుగా ఆయన విశాఖ జిల్లా నుంచే స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీగా గెలిచారు. అలా ఆయనకు విశాఖతో చట్టబద్ధమైన అనుబంధం ఏర్పడింది. అలాగే ఆయన విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. దాంతో బొత్స విశాఖ విజయనగరం కలిపి పార్టీ రాజకీయాలను చూస్తున్నారు. ఇక మిగిలింది శ్రీకాకుళం జిల్లా. అక్కడ కూడా ఆయనకు సొంత మనుషులు ఉన్నారు. జిల్లా రాజకీయాలతో మంచి అనుబంధం ఉంది. అలా బొత్స మూడు ఉమ్మడి జిల్లాల రాజకీయాలను నడిపిస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా మాజీ మంత్రి కురసాల కన్నబాబుని నియమించింది అధినాయకత్వం. ఆయన ఆ పదవిలోకి వచ్చినా సీనియర్ల నుంచి సహకారం అయితే ఉండడం లేదు. దాంతో ఆయన కూడా ఉత్సాహాన్ని తగ్గించేసుకుంటున్నారు. పైగా బొత్స వంటి బిగ్ షాట్ అన్నీ తానై వ్యవహరిస్తున్న చోట కన్నబాబు వాయిస్ చిన్నబోతోంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇపుడు మరో నాయకుడు గుడివాడ అమరనాధ్ గురించి చెప్పుకుంటే ఆయన కూడా బొత్స మాదిరిగా విశాఖ జిల్లాలో వైసీపీ రాజకీయాలను ఉమ్మడిగా చక్కబెడుతున్నారు. తాజా నియామకాలతో ఆయనను అనకాపల్లి జిల్లాకు అధ్యక్షుడిగా చేశారు. విశాఖ జిల్లాకు కొత్త అధ్యషుడిగా కేకే రాజుని నియమించారు.

కేకే రాజు నియమితులైనా కూడా విశాఖ సిటీలో గుడివాడ హవాయే సాగుతోంది అని అంటున్నారు. ఆయనే అన్నింటా కనిపిస్తున్నారు అని అంటున్నారు. కేకే రాజు తన నియోజకవర్గం ఏమిటో తానేంటో అన్నట్లుగా ఉంటారు. దాంతో ఆయనకు చొరవ తక్కువ కావడంతో దూకుడు మీద ఉంటున్న గుడివాడ జోరు చూపిస్తున్నారు అని చెబుతున్నారు. ఇలా పార్టీ పరిశీలకులని ఇతర బాధ్యులని ఎందరు నేతలను నియమించినా ఈ ఇద్దరే విశాఖ జిల్లాలో ప్రముఖంగా వైసీపీలో కనిపిస్తున్నారు అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది పార్టీకి లాభమా నష్టమా అన్నది ఆలోచించుకోవాలసింది హై కమాండే అని అంటున్నారు.