Begin typing your search above and press return to search.

రూ.100 లంచం చాలా చిన్న విషయం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అవినీతి కేసులో అరెస్టు అయిన ఒక ఉద్యోగిని నిర్దోషిగా ప్రకటించింది

By:  Tupaki Desk   |   6 Oct 2023 12:13 PM GMT
రూ.100 లంచం చాలా చిన్న విషయం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
X

బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అవినీతి కేసులో అరెస్టు అయిన ఒక ఉద్యోగిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ఉద్యోగి లంచంగా తీసుకుంది చిన్న మొత్తమే కదా అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. 2007లో మహారాష్ట్రలోని పూణె పౌడ్‌ గ్రామీణ ఆసుపత్రిలో అనిల్‌ షిండే అనే వ్యక్తి వైద్యుడిగా పనిచేసేవారు. ఈక్రమంలో ఆయన ఒక రోజు విధుల్లో ఉండగా ఓ వ్యక్తి గాయాలతో వచ్చాడు. తనపై కొంతమంది దాడి చేశారని తనకు గాయాలు అయినట్లుగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని అనిల్‌ షిండేను కోరాడు. దానికి డాక్టర్‌ అనిల్‌..రూ.100లు ఇస్తే సర్టిఫికెట్‌ ఇస్తానని లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఏసీబీ ముందస్తు ప్లాన్‌ తో గాయపడ్డ వ్యక్తి డబ్బు ఇస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌ గా వైద్యుడు అనిల్‌ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు.

ఆ తర్వాత ఏసీబీ అధికారులు డాక్టర్‌ అనిల్‌ పై కేసు నమోదు చేశారు. ఈ కేసును ఏసీబీ న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం 2012 జనవరిలో డాక్టర్‌ అనిల్‌ ను నిర్ధోషిగా ప్రకటించింది. దీంతో అధికారులు ఏసీబీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టు కూడా ఏసీబీ కోర్టు తీర్పును సమర్ధించింది. డాక్టర్‌ అనిల్‌ ను నిర్ధోషిగా ప్రకటించింది.

ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 2007లో రూ.100 లంచం తీసుకోవడం చాలా చిన్న విషయమని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం నిందితుడిని నిర్దోషిగా పరిగణిస్తున్నామని తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర జైన్‌ తో కూడిన బాంబే హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం తాజాగా ఈ తీర్పునిచ్చింది. దీంతో వైద్యుడు అనిల్‌ నిర్దోషిగా విడుదలయ్యాడు.