Begin typing your search above and press return to search.

బీజేపీ పై ఇండియా కూటమి గెలిచిందా ?

మొదటి టెస్టులో ఇండియా కూటమి గెలిచింది. విషయం ఏమిటంటే వివిధ రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి

By:  Tupaki Desk   |   9 Sep 2023 5:46 AM GMT
బీజేపీ పై ఇండియా కూటమి గెలిచిందా ?
X

మొదటి టెస్టులో ఇండియా కూటమి గెలిచింది. విషయం ఏమిటంటే వివిధ రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ, ఎన్డీయే అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఇండియాకూటమి తరపున ఏడుగురు అభ్యర్ధులు రంగంలోకి దిగారు. కేరళ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పోటీ ముమ్మరంగా జరిగింది. బీజేపీ అభ్యర్ధులను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఇండియాకూటమి వ్యూహాత్మకంగా తమ అభ్యర్ధులను పోటీలోకి దింపాయి.

ఇందులో భాగంగానే బీజేపీ అభ్యర్ధులకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి సింగిల్ అభ్యర్ధిని పోటీకిదింపాయి. అంటే ఎప్పటినుండో అనుకుంటున్న వన్ ఆన్ వన్ అనే ఫార్ములాను ఇక్కడ ఇండియాకూటమి ఫాలో అయ్యింది. దీని ప్రకారం ఏడు సీట్లలో మూడింటిలో బీజేపీ గెలిస్తే మిగిలిన నాలుగు సీట్లను ఇండియాకూటమి గెలుచుకుంది. వీటన్నింటిలోను యూపీలో ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఇపుడు జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికలు ఒక టెస్టుగా భావించాయి.

ఈ టెస్టులో ఇండియాకూటమి సక్సెస్ అయినట్లే అనుకోవాలి. ఇపుడు వచ్చిన ఫలితాల ఆధారంగానే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇండియాకూటమి గట్టిగా వర్కవుట్ చేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని కూటమి నేతలకు అనిపించింది. నాలుగు స్ధానాల్లో జేఎంఎం, కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ తరపున అభ్యర్ధులు పోటీచేసి గెలిచారు. కాబట్టి ఇప్పటి ఎన్నికల ఫలితాలను ఒక మోడల్ గా ఇండియాకూటమిలోని కీలక నేతలు అధ్యయనం చేయబోతున్నారు.

ఇండియాకూటమిలోని పార్టీలు కాస్త త్యాగాలకు సిద్ధంగా ఉంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అర్ధమవుతోంది. ఇండియాకూటమి బలోపేతమైతే రాబోయే ప్రమాధాన్ని నరేంద్రమోడీ గ్రహించినట్లున్నారు. అందుకనే కూటమిని ఎలాగైనా దెబ్బకొట్టాలని పదేపదే వ్యూహాలు మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇండియాకూటమి వైపు జనాలు ఆకర్షితులు కాకుండా దేశంపేరును ఇండియా అని కాకుండా భారత్ అని మార్చటం. ఇక్కడ దేశంపేరు మార్చినంత మాత్రాన ఇండియాకూటమికి దెబ్బ పడిపోతుందని అనుకోవటం మోడీ అమాయకత్వమే కానీ ఇంకోటి కాదు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.