'సిగ్గులేనితనానికి ఓ పరిమితి ఉంటుంది!'... బీజేపీ ఎంపీపై ఎందుకంత కోపం?
అవును... హర్యానా బీజేపీ రాజ్యసభ ఎంపీ రామచంద్ర జంగ్రా.. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై వివాదాస్పద ప్రకటన చేశారు.
By: Tupaki Desk | 25 May 2025 4:02 AMరాజకీయ నాయకులు మైకుల ముందు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అంటుంటారు! నలుగురిలో మాట్లాడేముందు నాలుకను అదుపులోకి పెట్టుకోకపోతే ఊహించని ప్రమాదాలను కొనితెచ్చుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంటారు! ఈ సమయంలో పహల్గాం ఉగ్రదాడిపై ఓ బీజేపీ ఎంపీ చేసిన వాఖ్యలు ఇప్పుడు రాజకీయ తుఫానుకు దారితీస్తున్నాయి!
అవును... హర్యానా బీజేపీ రాజ్యసభ ఎంపీ రామచంద్ర జంగ్రా.. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై వివాదాస్పద ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇది రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తుంది. ఇందులో భాగంగా.. పహల్గాంలో తమ భర్తలను కాలుస్తున్నప్పుడు మహిళలు ఉగ్రవాదులతో పోరాడాల్సిందని.. కానీ, వారిలో యోధుల స్ఫూర్తి లేదని, పోరాడలేదని అన్నారు.
ఒకవేళ ఆ సమయంలో ఉగ్రవాదులతో మహిళలు పోరాడి ఉంటే.. తక్కువ మంది చనిపోయి ఉండేవారని.. ఆ సమయంలో మహిళలు అహల్యాబాయి హోల్కర్, ఝాన్సీ రాణి లాగా ధైర్యాన్ని ప్రదర్శించాలని ఆయన మహిళలను కోరారు! అందుకే ప్రధాని మోడీ అగ్నివీర్ పథకాన్ని ప్రారంభించారని, ప్రతీ పర్యాటకుడు అగ్నివీర్ అయ్యి ఉండాల్సిందని అన్నారు!
అదే జరిగి ఉంటే వారంతా ఉగ్రవాదులను చుట్టుముట్టి ఉండేవారని.. అక్కడ నుంచి ఏ ఉగ్రవాదీ తిరిగి వెళ్లేవాడు కాదని చెప్పుకొచ్చారు! ఇదే సమయంలో... పహల్గాం దాడిలో నిందితులను పట్టుకోలేకపోవడంపై మాట్లాడిన ఆయన.. సైన్యం ఆ ఉగ్రవాదులను పట్టుకోలేకపోయినా, వారు దాక్కున్న ప్రదేశాలను, వారి యజమానులను ధ్వంసం చేసిందని తెలిపారు!
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ దీపేంద్ర సింగ్ హుడా స్పందించారు. ఈ సందర్భంగా జాంగ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... పహల్గాంలో ఉగ్రవాదులు తమ భర్తలను చంపి, వీరి జీవితాలను నాశనం చేస్తే.. ఇప్పుడు ఈ బీజేపీ ఎంపీ వారి గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.. ఇది చాలా అసహ్యకరం, అమరవీరుల కుటుంబాలకు అవమానం అని అన్నారు!
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హెడ్ సుప్రియా శ్రీనాటే ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ బీజేపీ ఎంపీపై నిప్పులు చెరిగారు. ‘వీరి పార్టీ సింధూరం గురించి మాట్లాడుతుందా? సిగ్గులేనితనానికి ఒక పరిమితి ఉంటుంది!’ అంటూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు!