అమరావతికి బిల్ గేట్స్...ఇంటర్నేషనల్ ఫోకస్
బిల్ గేట్స్ అమరావతిలో సోమవారం పర్యటిస్తారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా అమరావతిలో తొలిసారిగా అడుగుపెట్టనున్నారు.
By: Satya P | 16 Feb 2026 12:57 AM ISTఏపీ రాజధాని అమరావతి ఇపుడు ఇంటర్నేషనల్ ఫోకస్ కి రెడీ అవుతోందా అంటే కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఒక వైపు ఏపీలో అమరావతిని సంపదను సృష్టించే రాజధానిగా తీర్చిదిద్దడమే కాదు, అభివృద్ధికి నమూనానా మార్చుతున్నారు. ఇంకో వైపు ప్రపంచ పటంలో అమరావతి ఉండేలా బహు విధాలుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ నేరుగా అమరావతికి రావడం ఇపుడు సంచలనంగా మారుతోంది.
ఆసక్తికరంగా :
బిల్ గేట్స్ అమరావతిలో సోమవారం పర్యటిస్తారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా అమరావతిలో తొలిసారిగా అడుగుపెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కొనసాగుతున్న సహకారాన్ని సైతం బిల్ గేట్స్ సమీక్షించనున్నారు. మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లను తన పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ కలుస్తారు. విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవసాయం వంటి రంగాలలో తన గేట్స్ ఫౌండేషన్ నుంచి అందించే సహకారాన్నికూడా వివరిస్తారు. అలాగే తాను మద్దతు ఇచ్చే ప్రాజెక్టుల విస్తరణపైన కూడా కూటమి ప్రభుత్వంతో ఆయన చర్చించనున్నారు.
ఆర్టీజీఎస్ సందర్శన :
బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఆర్టీజీఎస్ ని సందర్శిస్తారు. ఇక బిల్ గేట్స్ ఏపీ పర్యటన అమరావతిలోని సచివాలయంతో మొదలవుతుంది. ఆయన సోమవారం ఉదయం పది గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం ఆయన ఏపీ పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి సాధనంగా చేసుకున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ పద్ధతులు గురించి వాటి ఫలితాల గురించి బిల్ గేట్స్ కి సోదహరణంగా వివరిస్తారు.
కీలక అంశాల మీదనే :
బిల్ గేట్స్ ఏపీకి వస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వం అనేక కీలక అంశాలను ఆయనతో చర్చిస్తుంది అని అంటున్నారు. స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, అలాగే ప్రజారోగ్య కార్యక్రమాలు, వ్యవసాయ సంస్కరణలు విద్యా రంగంలోని చేపడుతున్న సంస్కరణల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు గేట్స్ ఫౌండేషన్ మద్దతుతో ఏపీలో అమలు చేస్తున్న మెడ్-టెక్, డయాగ్నస్టిక్స్ సంజీవని ప్రాజెక్టుల పురోగతిని కూడా ప్రభుత్వం ఆయనకు వివరిస్తుంది.
సాంకేతికత ఆధారిత అభివృద్ధి :
బిల్ గేట్స్ ఆయన ప్రతినిధి బృందం అమరావతిలోని ఉండవల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శిస్తుంది అని చెబుతున్నారు. ఈ సందర్భంగా డ్రోన్ ఆధారిత వ్యవసాయం ఏఐ ఆధారిత సాగు పద్ధతులను పరిశీలిస్తుంది. రాష్ట్రంలోని అన్ని రంగాలలో సంస్థాగత భాగస్వామ్యాలను బలోపేతం చేయడం సాంకేతికత ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలను పెంచడం బిల్ గేట్స్ పర్యటన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఏపీకి బిల్ గేట్స్ రావడం ఒక మంచి పరిణామంగా అభివృద్ధికి సంకేతంగా కూడా పేర్కొంటున్నారు.
