మోడీ పేరు వాజ్ పేయి...నితీష్ కొత్త వింత !
ఆ తరువాత సారీ అని మళ్ళీ సర్దుకున్నారు. వాజ్ పేయ్ గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని సభలో కొనియాడారు.
By: Tupaki Desk | 30 May 2025 6:42 PMబీహార్ సీఎం నితీష్ కుమార్ మీద రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. ఆయన ఈ మధ్యనే ఒక కార్యక్రమంలో పాల్గొంటే తనకు స్వాగతం పలికి పూలకుండి చేతికి ఇచ్చిన ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి నెత్తిన అదే పూల కుండను పెట్టి వింతగా వ్యవహరించారు అని ప్రచారం సాగింది. అది జరిగి కొద్ది రోజులు కాక ముందే ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభలో నితీష్ కొత్త వింత అన్నట్లుగా ఆయన పేరునే మరచారు. మోడీని ప్రధానిగా చెప్పబోయి అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాని అనేశారు.
ఆ తరువాత సారీ అని మళ్ళీ సర్దుకున్నారు. వాజ్ పేయ్ గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని సభలో కొనియాడారు. మోడీని ప్రజలు అభినందించాలని ఆయన కోరడమూ మరో విశేషం. దీంతో వేదిక మీద ఉన్న నాయకులు అంతా నితీష్ కుమార్ తడబడ్డారా లేక పొరబడ్డారా అని చర్చించుకున్నారు.
మరో వైపు చూస్తే నితీష్ కుమార్ కి ఇది కొత్త వింత కాదని అంటున్నారు. ఆయన ఈ ఏడాది జనవరిలో ఇదే 30వ తేదీన మహాత్మా గాంధీ వర్ధంతి వేళ అంతా నిశ్శబ్దంగా నివాళి అర్పిస్తుండగా ఒక్కసారిగా ఆయన చప్పట్లు కొట్టి అందరినీ ఆశ్చర్యపరచారు.
అదొక్కటే కాదు ఈ ఏడాది మార్చి నెలలో బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఒక ఆటల కార్యక్రమంలో అందరూ కలసి జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో నితీశ్ కుమార్ నవ్వడంతో పాటు పక్కనున్న వారితో పెద్ద శబ్దం చేసుకుంటూ మాట్లాడారు. ఇలా ఈ వీడియో క్లిప్స్ గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో నితీష్ కుమార్ కి ఏమి అయింది అన్న చర్చ గట్టిగానే సాగుతోంది. ఆయన వయసు ఏడున్నర పదులుగా ఉంది. ఆయన సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు. దాంతో ఆయన మానసికంగా శారీరకంగా అలసిపోయారు అన్న జన సురాజ్ నాయకుడు ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలే నిజమా అన్న చర్చ సాగుతోంది.
మరో వైపు చూస్తే నితీష్ కుమార్ కి జ్ఞాపక శక్తి తగ్గిందా లేక ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్న చర్చకు తెర లేస్తోంది అయితే విపక్షాలు మాత్రం నితీష్ కుమార్ పాలన చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఆయన వింత ప్రవర్తన తీరుని ఎత్తి చూపుతున్నారు అయితే ఇపుడు సాక్షాత్తు మోడీయే అదంతా చూశారు కాబట్టి తొందరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం పట్ల ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తారా అని అనుకుంటున్నారు.