Begin typing your search above and press return to search.

నంద్యాలలో భూమా వర్సెస్ భూమా ...!

కజిన్ గా ఉన్న బ్రహ్మానందరెడ్డికి భూమా సొంత కొడుకు జగత్ విఖ్యాత్ రెడ్డికి మధ్య పోటీ చాలానే ఉంది అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 2:30 PM GMT
నంద్యాలలో  భూమా వర్సెస్ భూమా ...!
X

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో నంద్యాల రాజకీయంగా కీలకమైన స్థానం. ఎంతో మంది దిగ్గజ నేతలు తమ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన సీటు అది. అలాంటి సీటు ఇపుడు టీడీపీకి పూర్తిగా ట్రబుల్స్ ని పెడుతోంది. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నంతవరకూ నంద్యాల విషయంలో జోక్యం ఉండేది కాదు, కానీ ఆయన మరణాంతరం వారసుల విషయంలో వచ్చిన తేడాలు విభేదాలు ఇపుడు రాజకీయ తెర మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి.

భూమా నాగిరెడ్డి చనిపోయేనాటికి ఆయన కుమారుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి చాలా చిన్నవారు అయితే ఇపుడు ఆయన యువకుడు అయ్యారు. యువ రాజకీయ వేత్తగా మారిపోయారు. ఆయన టీడీపీ నుంచి 2024 ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. కానీ చూడబోతే ఆ టికెట్ కాస్తా మాజీ ఎమ్మెల్యే, నంద్యాల ఇంచార్జి భూమా బ్రహ్మానందరెడ్డికి వెళ్ళేలా ఉంది.

ఇటీవల చంద్రబాబు నంద్యాల సీటు విషయంలో సమీక్ష నిర్వహించి ఇండైరెక్ట్ గా బ్రహ్మానందరెడ్డికే టికెట్ అని చెప్పేశారు అని అంటున్నారు. దాని మీద తాజాగా జగత్ విఖ్యాత్ రెడ్డి అయితే కీలక కామెంట్స్ చేశారు. తన తండ్రి రాజకీయం నంద్యాలలో ఆపేశారని, అందువల్ల ఆ సీటు నుంచే తాను రాజకీయం మొదలెట్టానని చెప్పారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి తాను నంద్యాలలో రాజకీయం చేస్తానని అలా కాదని చెప్పే హక్కు ఎవరికీ లేదు అంటూ మాట్లాడారు.

అంటే ఇండైరెక్ట్ గా ఆయన టీడీపీకి షాక్ ఇచ్చారని అంటున్నారు. తనను నంద్యాలలో తిరగవద్దు అని అధినాయకత్వం ఎక్కడా చెప్పలేదని కూడా ఆయన అంటున్నారు. తాను నంద్యాలలో ప్రతీ గడపకూ వెళ్తాను అని జగత్ విఖ్యాత్ గట్టిగానే చెబుతున్నారు. తన రాజకీయ ప్రస్థానం అంతా నంద్యాల నుంచే అని క్లియర్ గా చెప్పేశారు.

దీంతో ఇపుడు నంద్యాల టీడీపీలో సరికొత్త వార్ మొదలైంది అంటున్నారు. కజిన్ గా ఉన్న బ్రహ్మానందరెడ్డికి భూమా సొంత కొడుకు జగత్ విఖ్యాత్ రెడ్డికి మధ్య పోటీ చాలానే ఉంది అంటున్నారు. ఇక టీడీపీలో సీనియర్ నేత ఫరూఖ్ తనకే టికెట్ అని అంటున్నారు. ఇంకో వైపు భూమా నాగిరెడ్డి అనుచరుడు అయిన ఏవీ సుబ్బారెడ్డి కూడా నంద్యాల టికెట్ రేసులో ఉన్నారు.

దీన్ని బట్టి చూస్తూంటే నంద్యాల టీడీపీకి తలనొప్పిగా మారింది అని అంటున్నారు. అదే విధంగా నాగిరెడ్డి కుమారుడు నంద్యాల తన రాజకీయ వేదిక అంటూ చేసిన కామెంట్స్ చూస్తూంటే ఇక అన్నదమ్ముల సవాల్ కి నంద్యాల వేదికగా మరుతోంది అని అంటున్నారు. భూమా అఖిల ప్రియ 2917లో ఏరి కోరి తన కజిన్ భూమా బ్రహ్మానందరెడ్డిని ఎమ్మెల్యేగా చేసేందుకు శ్రమించింది. అదే కజిన్ ఇపుడు ఆమెకు కానీ ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి కానీ నచ్చడంలేదు.

తమ తండ్రి సీటు అని వారు అంటున్నారు. నిజానికి భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ మాత్రమే సొంత సీటు. ఆయన ఒకసారి ఎంపీగా పోటీ చేయడంతో ఆళ్ళగడ్డకు ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ తరువాత భూమా దంపతులు ఇద్దరూ అసెంబ్లీకి పోటీ చేసినపుడు నాగిరెడ్డి తన భార్యకు ఆళ్లగడ్డ వదిలి తాను నంద్యాల షిఫ్ట్ అయ్యారు. ఈ రకంగా చూసుకుంటే నంద్యాల అన్నది టీడీపీ సీనియర్ నేత ఫరూఖ్ సొంత సీటు మాత్రమే అని చెబుతున్నారు.

అయినా రాజకీయాలలో సీటు ఎవరికీ సొంతం కాదని అధినాయకత్వం ఎవరికి సీటు ఇస్తే వారు పనిచేసి తీరాలని అంటున్నారు. కానీ భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అయితే పట్టు విడవడంలేదు. దాంతో భూమా వర్సెస్ భూమాగా నంద్యాల సీన్ మారిపోతోంది.