Begin typing your search above and press return to search.

సిటీలో బంగ్లాదేశ్ యువతి.. ఆరా తీస్తే షాకుల మీద షాకులు

రీల్ స్టోరీ కాదు రియల్ స్టోరీ. దీని గురించి తెలిసినంతనే ఉలికిపాటే కాదు.. ఇలా కూడా జరుగుతుందా? అన్న షాక్ కు గురి కాకమానదు

By:  Tupaki Desk   |   11 Feb 2024 8:30 AM GMT
సిటీలో బంగ్లాదేశ్ యువతి.. ఆరా తీస్తే షాకుల మీద షాకులు
X

రీల్ స్టోరీ కాదు రియల్ స్టోరీ. దీని గురించి తెలిసినంతనే ఉలికిపాటే కాదు.. ఇలా కూడా జరుగుతుందా? అన్న షాక్ కు గురి కాకమానదు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలోకి వస్తున్నారన్న విషయం పాతదే అయినా.. అదెంత తేలికగా సాగుతుందన్న విషయంతో పాటు.. అలా అక్రమంగా వచ్చే వారికి హైదరాబాద్ ఒక వేదికగా మారిందన్న నిజం మరింత ఆందోళనకు గురి చేయకమానదు.

తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. కొత్త సందేహాలకు తావిచ్చేలా మారింది. ఈ తరహాలో హైదరాబాద్ లో ఎంతమంది అక్రమంగా ఉన్నారన్నది ఇప్పుడు ప్రశ్న. అక్రమంగా భారత్ లోకి అడుగు పెట్టిన బంగ్లాదేశ్ యువతి హైదరాబాద్ కు చేరటం.. ఒక కుటుంబం అండతో వ్యభిచారం చేయటం.. ఆ క్రమంలో జరిగిన గొడవతో అసలు విషయం బయటకు వచ్చింది. అసలేం జరిగిందంటే..

పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని ఒక కాలనీలో 27 ఏళ్ల సోనియా.. 24 ఏళ్ల మహ్మద్ సల్మాన్ దంపతులు. బట్టల షాపులో పని చేసే సల్మాన్.. సోనియాను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సోనియా విషయానికి వస్తే ఆమె బంగ్లాదేశ్ మహిళకు.. భారత్ కు చెందిన వ్యక్తికి పుట్టిన సంతానం. కోల్ కతాలో సోనియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక యాప్ లో సోనియా చాట్ చేస్తున్న క్రమంలో బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల స్రిస్టీ అక్తర్ పరిచయమైంది. వీరి మధ్య స్నేహం పెరిగిన క్రమంలో తనకు డబ్బులు సంపాదించేందుకు జాబ్ ఏమైనా దొరుకుతుందా? అని స్రిస్టీ అక్తర్ అడగ్గా.. ఇళ్లల్లో పని చేసే ఉద్యోగమైతే నెలకు రూ.10వేలు వస్తాయని సోనియా చెప్పింది.

అలా కాకుండా వ్యభిచారం చేసినట్లైయితే.. నెలకు రూ.20వేలు వస్తాయని చెప్పటంతో.. డబ్బుల కోసం ఏమైనా చేస్తానని స్రిస్టీ చెప్పింది. భారత్ కు ఎలా రావాలన్న దానికి.. ఆ రిస్కు నువ్వు తీసుకోవాలని చెప్పిన సోనియా.. భారత్ కు వస్తే తనకుఫోన్ చేయమని నెంబరు ఇచ్చింది. అక్రమ మార్గంలో బంగ్లాదేశ్ సరిహద్దులు దాటిన స్రిస్టీ కోల్ కతాకు చేరుకుంది. అక్కడి నుంచి రైల్లో నేరుగా సికింద్రాబాద్ కు వచ్చి సోనియాకు ఫోన్ చేసింది.

వారు వెళ్లి ఆమెను చాంద్రాయణగుట్టలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఆమెతో వ్యభిచారం చేయించటం మొదలు పెట్టారు. కస్టమర్ల వద్దకు సోనియా స్వయంగా తీసుకెళ్లి స్రిస్టీని తీసుకొచ్చేది. కస్టమర్లతో మాట్లాడేదంతా సోనియానే చేసేది. ఇదిలా ఉంటే.. తాజాగా సోనియా ఫోన్ కు కాల్ రావటం.. ఆ టైంలో ఆమె లేకపోవటంతో స్రిస్టీ మాట్లాడింది. కస్టమర్ తో నేరుగా మాట్లాడి అత్తాపూర్ కు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి స్రిస్టీ లేకపోవటంతో సోనియాకు అనుమానం వచ్చి ఆమె ఫోన్ లో చివరి కాల్ కు ఫోన్ చేయగా.. అత్తాపూర్ వస్తున్న విషయాన్ని అర్థం చేసుకుంది.

వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పిన సోనియా.. స్రిస్టీ కోసం వెతకసాగారు. చివరకు వారికి ఆమె కనిపించింది. తమకు చెప్పకుండా ఎంతుకు వచ్చావని నిలదీయగా.. వారి మధ్య గొడవ జరిగింది. సోనియా చేతిలో సెల్ లాక్కున్న స్రిస్టీ డయల్ 100కు ఫోన్ చేసింది. దీంతో.. అక్కడకు అత్తాపూర్ పోలీసులు రావటం.. అసలు విషయం తెలుసుకొని చంద్రాయణగుట్ట పోలీసులకుఅప్పజెప్పారు. దీంతో ముగ్గురు మీద కేసులు నమోదు చేశారు. స్రిస్టీ అక్తర్ గురించి ఆరా తీయగా ఆమెకు బంగ్లాదేశ్ లో భర్త.. ఇద్దరు పిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించారు. భర్త సంపాదన సరిపోకపోవటంతో అక్రమ వార్గంలో భారత్ కు వచ్చి వ్యభిచారం చేసినట్లుగా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహాలో ఎంతమంది హైదరాబాద్ కు వచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఉంటున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.