Begin typing your search above and press return to search.

పంచ్ పాల్‌కే పంచ్‌! బాబూమోహ‌న్ ఎంత ప‌నిచేశాడు!

అంతేకాదు..ఈయ‌న‌ను చూపించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారంతా వ‌చ్చేయాల‌ని పాల్ పిలుపు కూడా ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   26 April 2024 2:30 PM GMT
పంచ్ పాల్‌కే పంచ్‌! బాబూమోహ‌న్ ఎంత ప‌నిచేశాడు!
X

హాస్య న‌టుడు, మాజీ మంత్రి బాబూ మోహ‌న్ .. పొలిటిక‌ల్ క‌మెడియ‌న్ పంచ్ పాల్‌కే పంచ్ వేశాడా? అంటే.. ఔన‌నే అంటున్నారు నెటిజ‌న్లు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌జాశాంతి పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న‌ట్టు కొన్నాళ్ల కింద‌ట ప్ర‌క‌టించారు. ఇక‌, ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.. కేఏ పాల్ స‌మ‌క్షంలో ఆయ‌న చేత్తో కండువా కూడా క‌ప్పించుకున్నారు. ఆ వెంట‌నే.. ఆయ‌న వరంగ‌ల్ ఎస్సీ పార్ల‌మెంటు స్థానం నుంచి నామినేష‌న్ కూడా వేశారు. దీంతో బాబూ మోహ‌న్‌.. ప్ర‌జాశాంతి పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్నాడ‌ని.. పాల్ ఊరూవాడా చాటుకున్నారు.

అంతేకాదు..ఈయ‌న‌ను చూపించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారంతా వ‌చ్చేయాల‌ని పాల్ పిలుపు కూడా ఇచ్చాడు. బాబూమోహ‌న్‌ను ఆకాశానికి కూడా ఎత్తేశారు. అయితే.. తాజాగా బాబూ మోహ‌న్ యూట‌ర్న్ తీసు కున్నాడు. పాలే పంచ్‌లు వేస్తాడ‌ని అనుకుంటే.. ఆయ‌నకే బాబూమోహ‌న్ పంచ్ వేశాడు. అస‌లు త‌న‌కు ప్ర‌జాశాంతి పార్టీతో ఎలాంటి సంబంధం లేద‌న్నాడు. అంతేకాదు.. ప్ర‌జాశాంతి పార్టీ కూడా ఉందా? అని ముఖం చిట్లించారు. అంతేకాదు.. కండువా క‌ప్పుకొన్న సంగ‌తిలోనూ ట్విస్ట్ ఇచ్చారు.

అస‌లు తాను ప్ర‌జాశాంతి పార్టీలో చేరిన‌ట్టు ఎవురు చెప్పార‌ని నిల‌దీశారు. అంతేకాదు.. పాల్ త‌న‌ను కాఫీ తాగుదాం ర‌మ్మంటే ఆయ‌న ఉంటున్న ఇంటికి వెళ్లాన‌న్నారు. తాను ఏదో మాట్లాడుతుంటే.. త‌న భుజంపై కండువా వేశాడ‌ని.. తాను వ‌ద్ద‌న్నా సైలెంట్‌గా ఉండ‌మ‌ని చెప్పాడ‌ని దీంతోతాను మౌనం వ‌హించాన‌ని చెప్పారు.ఇక‌, వ‌రంగ‌ల్ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తాను తీసుకో! అంటే.. తీసుకోలేద‌ని చెప్పారు. కానీ, పాల్ మాత్రం త‌నంత‌ట త‌నే.. త‌న‌ను వ‌రంగ‌ల్ పార్టీ అధ‌క్య‌క్షుడిని చేశార‌ని.. ఇవ‌న్నీ..త న‌కు ఏమీ తెలియ‌వ‌ని అన్నారు.

కొస‌మెరుపు.. : అయితే.. బాబు మోహ‌న్ యూట‌ర్న్ తీసుకోవ‌డం వెనుక‌.. నామినేష‌న్ ప‌త్రాల దాఖ‌లుకు ముందే.. బీఫాం ఇచ్చే విష‌యంలో వివాదం వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. కోటి రూపాయ‌లు పార్టీ ఫండ్ ఇస్తే.. బీఫాం ఇస్తాన‌ని పాల్ ష‌ర‌తు పెట్ట‌డంతో బాబూ మోహ‌న్ అడ్డం తిరిగార‌ని.. తాను ఇండిపెండెంట్‌గానే పోటీ చేయ‌నున్న‌ట్టు చెబుతున్నార‌ని అంటున్నారు.