Begin typing your search above and press return to search.

అయోధ్య అధ్యాయం : ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేస్తారు?

దేశంలోని కోట్లాది మంది ఏళ్లకు ఏళ్ల తరబడి అయోధ్యలో శ్రీరాములోరి ఆలయం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Jan 2024 5:30 PM GMT
అయోధ్య అధ్యాయం : ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేస్తారు?
X

దేశంలోని కోట్లాది మంది ఏళ్లకు ఏళ్ల తరబడి అయోధ్యలో శ్రీరాములోరి ఆలయం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వందల ఏళ్లుగా హిందువులు పలువురు ఈ ఆలయం కోసం కలలు కంటున్న్నారు. వారి కలను సాకారం చేస్తూ.. ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. చారిత్రాత్మకంగా అభివర్ణించే ఈ రోజు కోసం ఎంతో అత్రతగా ఎదురుచూస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఇంతకీ ఆలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి? దానికి ఎందుకంత ప్రాధాన్యతను ఇస్తారు? ఇంతకీ ఆ రోజు ఏం జరుగుతుంది? బాలరాముని ప్రాణప్రతిష్ఠకు ఎందుకంత ప్రాధాన్యత అన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలే కాదు.. దానికి అంత ప్రాధాన్యత ఎందుకో ఇట్టే అర్థమవుతుంది.

హిందూ ధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నది. దానికి తగ్గట్లే.. ఆ ఆలయానికి పేరుప్రఖ్యాతులు ఉంటాయన్నది నమ్మకం. ఆలయంలో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని చెబుతారు. ఏదైనా ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో ప్రాణ ప్రతిష్ఠ అన్నది చాలా చాలా ముఖ్యం.

అప్పటివరకు విగ్రహంగా ఉన్న దానికి.. జీవం పోయటాన్ని ప్రాణప్రతిష్ఠగా పేర్కొంటారు. ప్రాణ్ అనే పదానికి ప్రాణశక్తి అని.. ప్రతిష్ఠ అనే పదానికి స్థాపన అని అర్థం. సింఫుల్ గా చెప్పాలంటే ప్రాణ ప్రతిష్ఠ అంటే.. విగ్రహానికి ప్రాణం పోయటం లేదంటే.. సదరు దేవతను విగ్రహంలోకి ఆహ్వానించటంగా అర్థం చేసుకోవాలి. ప్రాణప్రతిష్ఠకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హత ఉండదు.

రాయిని లేదంటే.. లోహాన్ని విగ్రహాం తయారీకి వినియోగిస్తారు. వాటిని చేతలతోనూ..కాళ్లతోను పట్టుకోవాల్సి వస్తుంది. మరి.. అలాంటప్పుడు దేవుడి విగ్రహం అపవిత్రం అవుతుంది కదా? అయితే.. అప్పుడు రూపాన్ని మాత్రమే తీసుకుంటారు తప్పించి.. ఆ విగ్రహంలో ప్రాణం (జీవం) ఉండదని.. అందుకే.. దాన్ని విగ్రహంగా మలిచిన తర్వాత.. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా చేయాల్సి ఉంటుంది.

ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశ పెట్టి.. దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడు మాత్రమే విగ్రహం పూజకు అర్హత సాధిస్తుంది. విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాల్ని జపిస్తూ పూజలు చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలోకి కొలువయ్యాడని.. పేర్కొంటారు. అందుకే.. ఈ కార్యక్రమానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. శుభ ముహుర్తం లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు అస్సలు ఒప్పుకోరు.

ప్రాణప్రతిష్ఠకు ముందు ఆ విగ్రహానికి పవిత్ర గంగాజలం లేదంటే పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు. ఆ తర్వాత విగ్రహానికి శుభ్రమైన వస్త్రంతో తుడిచి.. నూతన వస్త్రాల్ని ధరింపజేస్తారు. ఆ తర్వాత ఆ విగ్రహానికి స్వచ్చమైన శుభప్రదేశంలో ఉంచి గంధం పూస్తారు. తర్వాత బీజాక్షర మంత్రాలు పఠిస్తూ.. ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠను పూర్తి చేస్తారు. ఆ సమయంలో పంచోపచారాలు చేస్తూ పూజలు చేస్తారు. చివరగా ఆ దేవతా స్వరూపానికి హారతి ఇస్తారు. ఈ టైంలో దేవంతుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు.