Begin typing your search above and press return to search.

వైసీపీతో చివరి బంధం తెంచుకున్న అవంతి !

ఆయన మంత్రిగా ఉన్నా విశాఖ జిల్లా రాజకీయాలను మొత్తం ఆనాటి వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వి విజయసాయిరెడ్డి చూసేవారు అని చెప్పుకునేవారు.

By:  Tupaki Desk   |   17 April 2025 5:22 PM
వైసీపీతో చివరి బంధం తెంచుకున్న అవంతి !
X

వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో భీమునిపట్నం ఎమ్మెల్యేగా గెలిచి ఆ వెంటనే జగన్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు అందుకున్న అవంతిని అంతా లక్కీ అన్నారు. ఆయన సరిగ్గా గురి చూసి కొట్టారని అందుకే అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీలోకే జంప్ చేసి మినిస్టర్ అయిపోయారు అని తెగ పొగిడారు. అయితే అవంతి అదృష్టం అంతా మూడు నాళ్ళ ముచ్చటగానే అయింది అని తరువాత వారే అనుకున్నారు.

ఆయన మంత్రిగా ఉన్నా విశాఖ జిల్లా రాజకీయాలను మొత్తం ఆనాటి వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వి విజయసాయిరెడ్డి చూసేవారు అని చెప్పుకునేవారు. దాంతో మంత్రిగా ఉన్నది తానా ఆయనా అని అవంతి అలిగిన సందర్భాలు అనేకం ఉన్నాయని అంటారు. అలా అవంతి మూడేళ్ళ పాటు ఏదో మంత్రిని అనిపించుకునే అసంతృప్తితో పనిచేశారు. చివరికి ఆయన మంత్రి పదవి పోయింది.

ఆయన అలా నాటి నుంచి పెంచుకున్న అసంతృప్తి జత కలిసి 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యాక కొద్ది నెలలకే ఆయన వైసీపీని వీడిపోయారు. ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలో చేరేది లేదని ఆయన చెప్పారు. ఆ ప్రకారమే తన విద్యా సంస్థలను చూసుకుంటూ ఉన్నారు.

అయితే ఇపుడు సండెన్ గా ఆయన కుమార్తె జీవీఎంసీలో ఆరవ వార్డు కార్పోరేటర్ అయిన ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక వైసీపీకి రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లుగా ఆమె పేర్కొంటూ అధినేత జగన్ కి లేఖ రాశారు. ఈ నెల 19న వైసీపీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ఉన్న నేపథ్యంలో ఆమె రాజీనామా అన్నది చర్చనీయాంశం అయింది.

ఇప్పటికే ఒక కో ఆప్షన్ సభ్యుడు ఇద్దరు జనసేన కార్పోరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇపుడు లక్ష్మీ ప్రియాంక రాజకీయం ఏ విధంగా సాగుతుంది అన్నది అంతా చర్చించుకుంటున్నారు. ఆమె కూడా జనసేన రూటేనా అన్నది ఆలోచిస్తున్నారు. అదే నిజమైతే అవంతి శ్రీనివాస్ కూడా తొందరలోనే ఆ పార్టీలో చేరుతారని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ విశాఖలో ఖాళీ అవుతోంది. ఒక్కొక్కరుగా కూటమి వైపుగా జారుకుంటున్నారు. కూటమి అవిశ్వాసం బ్రహ్మాండమైన నంబర్ తో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.