Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: సీఎం జగన్‌ పై రాయితో దాడి... కంటికి గాయం!

ఇందులో భాగంగా జగన్ పైకి ఓ ఆగంతకుడు రాయితో దాడికి పాల్పడటంతో ఆయన కంటికి గాయమైంది.

By:  Tupaki Desk   |   13 April 2024 4:41 PM GMT
బిగ్  బ్రేకింగ్: సీఎం జగన్‌  పై రాయితో దాడి... కంటికి గాయం!
X

ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ "మేమంతా సిద్ధం" అంటూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఈ బస్సు యాత్ర విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. ఇందులో భాగంగా జగన్ పైకి ఓ ఆగంతకుడు రాయితో దాడికి పాల్పడటంతో ఆయన కంటికి గాయమైంది.


అవును... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. "మేమంతా సిద్ధం" బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని సింగ్‌ నగర్‌ కు చేరుకున్న క్రమంలో జగన్‌ పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ సమయంలో ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ కనుబొమ్మకు తాకింది. దీంతో ఆయనకు స్వల్ప గాయమైంది!

క్యాట్‌ బాల్‌ లో రాయిపెట్టి విసరడంతో వేగంగా వచ్చి జగన్ ఎడమ కనుబొమ్మకు తగిలిందని తెలుస్తోంది! ఈ నేపథ్యంలో వెంటనే జగన్‌ కు బస్సులోనే వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఈ క్రమంలో... ప్రథమ చికిత్స అనంతరం జగన్ తిరిగి బస్సు యాత్ర కొనసాగించారు! ఇదే సమయంలో ఆ సమయంలో సీఎం జగన్‌ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి సైతం గాయమైందని తెలుస్తోంది.

ఇక... విజయవాడలో సీఎం జగన్‌ బస్సుయాత్రలో భాగంగా జనం పోటెత్తారు. దీంతో... విజయవాడ సిటీలో సుమారు మూడున్నర గంటలకు పైగా బస్సు యాత్ర అప్రతిహతంగా భారీ రోడ్‌ షో గా కొనసాగుతోంది! దీంతో... జగన్‌ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా... ఈ ఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ దాడి జరిగిన ప్రాంతంలో ఒకవైపు పాఠశాల, మరోవైపు రెండంతస్తుల భవనాలు ఉన్నాయి. మరోవైపు దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం గమనార్హం!