Begin typing your search above and press return to search.

టీడీపీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టిన రాజు గారు !

ఇక చాలా చోట్ల స్థానిక సంస్థలను కైవశం చేసుకోవడానికి కూటమి పార్టీలు కూడా ఆపరేషన్ ఆకర్ష్ ని మొదలెట్టాయి.

By:  Tupaki Desk   |   10 April 2025 1:30 AM
టీడీపీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టిన రాజు గారు !
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతీ చోటా నాయకులు ఆ కూటమిలోకి వెళ్ళిపోతున్నారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ సేద తీరుదామని తాపత్రయపడే వారితో కూటమి నిండిపోతోంది. ఇక చాలా చోట్ల స్థానిక సంస్థలను కైవశం చేసుకోవడానికి కూటమి పార్టీలు కూడా ఆపరేషన్ ఆకర్ష్ ని మొదలెట్టాయి.

ఇలా పిలుపు ఇవ్వడమే తడవుగా అలా వచ్చి వాలిపోతున్నారు వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులు. దీంతో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు అన్నీ కూడా కూటమి ఖాతాలో పడుతున్నాయి. కానీ ఉత్తరాంధ్రాలో చూస్తే ఒక జిల్లాలో చిత్రమైన రాజకీయం కనిపిస్తోంది. పక్కనే ఉన్న విశాఖలో కార్పోరేషన్ ని కైవశం చేసుకోవడానికి టీడీపీ కూటమి ఎత్తులు వేస్తున్న నేపథ్యం ఉంది.

కానీ విజయనగరం జిల్లలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదు దానికి కారణం అక్కడ టీడీపీకి కూటమికి పెద్దగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. ఆయన కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నారు. ఈ తరహా ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని ఆయన స్పష్టంగా చెప్పేస్తున్నారు. పైగా వచ్చిన వారు అధికార యావతో వస్తున్నారని వారిని చేర్చుకోవడం ద్వారా జనంలో గబ్బు అవడం తప్ప లాభం లేదని భావించడం వల్లనే ఆయన టీడీపీలోకి నో ఎంట్రీ అని బోర్డు పెట్టేశారు.

విజయనగరం కార్పోరేషన్ లో ఒకే ఒక్క టీడీపీ కార్పోరేటర్ 2021 ఎన్నికల్లో గెలిచారు. మొత్తానికి మొత్తం వైసీపీదే అయింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలామంది వైసీపీ కార్పోరేటర్లు కూటమి వైపు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. సై అంటే చాలు ఎక్కువ మంది ఆ వైపు నుంచి ఈ వైపునకు వస్తారని అంటున్నారు.

అయితే వారి రాకకు కూటమిలోని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు ఏడాది పాటు అధికారం చేతిలో ఉంటుంది కదా అని కూడా అంటున్నారు. అయితే రాజు గారు మాత్రం ఒక్క ఏడాది ఓపిక పట్టండి అని తన పార్టీ వారితో పాటు కూటమి నేతలకు నచ్చ చెబుతున్నారని అంటున్నారు.

అధికారం కోసం ఇలా చేసి జనంలో పలుచన కావద్దు అని పెద్దాయన చెబుతున్నారుట. అయితే విజయనగరం మొత్తం అధికారంలో ఉన్నా కార్పోరేషన్ లో అధికారం తమకు లేదని కూటమి నేతలు వాపోతున్నారుట. అక్కడ తమకు పనులు అవడం లేదని వారు అంటున్నారు. కానీ ఉందిలే మంచి కాలం అన్నది రాజు గారి ఆలోచన.

దీని వల్లనే వైసీపీకి ఈ కార్పోరేషన్ మిగిలింది అని అంటున్నారు. ఇక చూస్తే మాజీ ఎమంల్యే కోలగట్ల అనుచరులు అంతా ఇపుడు కూటమిలో చేరేందుకు చూస్తున్నారని అంటున్నారు ఆయన కూడా చూపు ఇటు వైపే ఉంచారని ప్రచారం సాగుతోంది. కానీ టీడీపీ పెద్దలు మాత్రం ఆ చాన్స్ ఇవ్వడం లేదు అని అంటున్నారు. దీర్ఘకాలంలో పార్టీకి వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే కనుక రాజు గారి ఈ నిర్ణయం వల్ల వైసీపీ అక్కడ ఊపిరి పీల్చుకుంటోంది అని అంటున్నారు