Begin typing your search above and press return to search.

అయోధ్యలో ప్రాణప్రతిష్ట వేళ అసదుద్ధీన్ కీలక వ్యాఖ్యలు!

అవును... అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ వృత్తాంతంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి సవాల్‌ చేశారు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:51 AM GMT
అయోధ్యలో ప్రాణప్రతిష్ట వేళ అసదుద్ధీన్  కీలక వ్యాఖ్యలు!
X

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది ప్రత్యక్షంగా.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది పరోక్షంగా వీక్షించనున్న నేపథ్యంలో... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ సమయంలో తాజాగా అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీటికి వీ.హెచ్.పి. నుంచి రిప్లై కూడా వచ్చేసింది!

అవును... అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ వృత్తాంతంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి సవాల్‌ చేశారు. ఇందులో భాగంగా... బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకొన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని కలబురగిలో మాట్లాడిన ఆయన... విశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు సమయంలోనే అక్కడ ఆలయం లేదని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... బాబ్రీ మసీదును కూల్చకుండా ఉండి ఉంటే... ఈ రోజున జరుగుతున్న వాటిని ముస్లింలు చూడాల్సి వచ్చేది కాదని ఒవైసీ వ్యాఖ్యానించారు. అదేవిధంగా... 500 ఏండ్లకు పైగా బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్‌ చేశారని.. జీబీ పంత్‌ యూపీ సీఎంగా ఉన్న సమయంలో మసీదులో విగ్రహాలను ఉంచారని పేర్కొన్నారు. రామ మందిరం గురించి మహాత్మాగాంధీ కూడా ఎప్పుడూ ప్రస్తావించలేదని తెలిపారు!

మరోపక్క అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. ఇందులో భాగంగా... అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ఖండించింది. ఈ క్రమంలో... గత 500 ఏళ్లలో మీ పూర్వీకులు ఎవరైనా అయోధ్యను సందర్శించారా..? అని ప్రశ్నించిన వీ.హెచ్.పీ... లండన్‌ లో న్యాయ విద్యను చదివిన ఒవైసీ... మసీదును కాపాడేందుకు ఎందుకు కోర్టుకు వెళ్లలేదని అడిగారు.

అందువల్ల ఇది ముమ్మాటికీ రాజకీయ పరమైన స్పందనే అని లైట్ తీసుకున్న వీ.హెచ్.పీ... త్వరలో వారూ రామ భక్తులుగా మారతామని ఆ పార్టీ అర్థం చేసుకోవాలని తెలిపింది. ఇందులో భాగంగా... అసదుద్దీన్ ఒవైసీ రామ నామాన్ని స్మరిస్తారు అని వీ.హెచ్‌‌.పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ సెటైర్లు వేశారు.

కాగా... ఈ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనున్న సంగతి తెలిసిందే. మరోపక్క రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది.