ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది.. వాయుసేన కీలక ప్రకటన!
ఈ నేపథ్యంలోనే స్పందించిన వాయుసేన... ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెల్లిపింది.
By: Tupaki Desk | 11 May 2025 9:48 AMపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయంలో కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను తాము తూ.చ. తప్పకుండా పాటిస్తున్నట్టు తెలిపింది. అయితే.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలను విశ్వసించవద్దని, తామే దీనిపై బ్రీఫింగ్ ఇస్తామని సైన్యం ప్రకటించింది.
వాస్తవానికి శనివారం సాయంత్రం 5 గంటల తర్వాత భారత్ – పాక్ లు కాల్పుల విరమణ అవగాహనకు వచ్చినట్టు ఇరు దేశాలు ప్రకటించాయి. మరోవైపు తాము మధ్యవర్తిత్వం చేశామని.. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. అయితే.. ఇది జరిగిన నాలుగు గంటల తర్వాత.. అనూహ్యంగా పాక్ వైపు నుంచి కవ్వింపులు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే స్పందించిన వాయుసేన... ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెల్లిపింది. అద్భుతమైన నైపుణ్యాలతో, అత్యంత కచ్చితత్వంతో తమకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసినట్లు పేర్కొంది. అయితే.. ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నందున అధికారికంగా వివరాలు వెల్లడిస్తామని.. అప్పటి వరకూ తప్పుడు సమాచారాని దూరంగా ఉండాలని ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.
ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఆదివారం ఉదయం 10 గంటలకు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భారత్ - పాక్ సరిహద్దుల వెంబడి ఉన్న ప్రస్తుత పరిస్థితులు.. అమెరికా జోక్యం.. భవిష్యత్తు వ్యూహాలు.. వంటి కీలక విషయాలపై వర్చించినట్లు తెలుస్తోంది. భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన దరిమిలా.. ప్రధాని నిర్వహించిన సమావేశం కీలకంగా మారింది.
అయితే.. దీనిలో ఏయే విషయాలు చర్చించారన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు.. తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని వైమానిక దళం అధికారులు కూడా ప్రకటించారు! అయితే.. మళ్లీ పాక్ కవ్వింపులకు పాల్పడినట్లు ఎక్కడా ఎలాంటి సంఘటనా తెరపైకి రాలేదు. ఏది ఏమైనా... కాల్పుల విరమణకు అంగీకరించామంటూనే ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని సైన్యం చెప్పడంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు!