Begin typing your search above and press return to search.

ధ‌ర్మ‌పురి అర్వింద్‌...ప‌సుపు బోర్డు లాంటి మ‌రో సంచ‌ల‌న హామీ!

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:29 AM GMT
ధ‌ర్మ‌పురి అర్వింద్‌...ప‌సుపు బోర్డు లాంటి మ‌రో సంచ‌ల‌న హామీ!
X

ధ‌ర్మ‌పురి అర్వింద్‌... నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ బీజేపీ నేత డైన‌మిజం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిజామాబాద్ జిల్లా ప్ర‌జ‌ల చిర‌కాల ఆకాంక్ష అయిన ప‌సుపు బోర్డు ఏర్పాటు హామీతో ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి ఎక్కి, అంతే దూకుడుతో ఎన్నిక‌ల్లో గెలిచి... త‌న‌దైన ముద్ర‌తో ఫైర్ బ్రాండ్ నేత‌గా నిలిచారు. అయితే, ప‌సుపుబోర్డు ఏర్పాటులో ఆల‌స్యం జ‌రిగిన‌ప్ప‌టికీ ఎట్ట‌కేల‌కు ఇటీవ‌ల ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తోనే పసుపు బోర్డు ప్ర‌క‌ట‌న చేయించారు. అలాంటి అర్వింద్ మ‌రోమారు నిజామాబాద్ జిల్లా రైతుల‌ కీల‌క హామీ నెరవేర్చే ప్ర‌క‌ట‌న చేశారు. అదే నిజాం షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ రీ ఓపెన్‌.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీ అర్వింద్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ధాన్యం కొనుగోళ్లో కేసీఆర్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. క్వింటాలు కు 10 కిలోల కోత పెట్టి ధాన్యం కొనుగోలు చేశారని అన్నారు. రీసైక్లింగ్ బియ్యం మాఫియా నడుపుతూ కోట్లు గడించారని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి గింజ తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో తాను ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు తెస్తానని బాండ్ రాసిన ప్రకారం పసుపు బోర్డు తీసుకొచ్చానని ఎంపీ అర్వింద్ గుర్తు చేశారు. ప్రధానీ మోదీ వల్లే పసుపు బోర్డు క‌ల నెర‌వేరింద‌ని తెలిపారు. అదే విధంగా బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. `ఉత్తరప్రదేశ్ లో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాం.. ఇక్కడ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరినీ అధికారంలోకి రాగానే ప్రారంభిస్తాం. చెరుకు పంటకు మద్దతు ధర ఇచ్చి ఫ్యాక్టరీలను నడుపుతాం` అని ధర్మపురి అర్వింద్ ప్ర‌క‌టించారు. ఎంపీ అర్వింద్ ఇచ్చిన ఈ సంచ‌ల‌న హామీ మ‌రోమారు ఆయ‌న‌కు గెలుపు ద‌రిచేరుస్తుందా? అంటే ఎదురుచూడాల్సిందే.